ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రిన్సిపల్ అక్రమాలు, వేధింపులపై గళం....మహిళా కానిస్టేబు‌ల్‌పై విద్యార్థినుల దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:38 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో అత్యంత ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపాల్ అక్రమాలు, వేధింపులకు వ్యతిరేకంగా మెరుపు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. కళాశాల హాస్టల్లో సమస్యలు, సరైన సౌకర్యాలు లేకపోవడం.. ముఖ్యంగా ప్రిన్సిపాల్ అనుచిత ప్రవర్తనపై విద్యార్థినులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించారు.


ఈ క్రమంలో.. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో.. ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో.. ఆ కానిస్టేబుల్ ఒక విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది. తమపై చేయి చేసుకున్నందుకు ఆగ్రహించిన మిగతా విద్యార్థినులు వెంటనే మహిళా కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. తిరిగి ఆమెపై దాడి చేశారు. "న్యాయం చేయాలని వస్తే మమ్మల్నే కొడతారా..?" అంటూ నిలదీశారు. గురుకుల కళాశాలల్లో ఇలాంటి వేధింపుల కేసులు తరచూ బయటపడుతున్నప్పటికీ, సాంఘిక సంక్షేమ శాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.


ఈ ఘటన కళాశాల పాలకమండలిపై, స్థానిక విద్యాధికారుల నిర్లక్ష్యంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. విద్యార్థినులు తమ ఆందోళనను విరమించేది లేదని , జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించేవరకు అక్కడే ఉంటామని తేల్చిచెప్పారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండేందు కు పోలీసులు, కొంతమంది విద్యార్థినులను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఇదిలా ఉండగా.. నవంబర్ 3వ తేదీ నుంచి కళాశాలలు బంద్ చేస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బకాయిల చెల్లింపుకు నవంబర్ 1వ తేదీ వరకు గడువు విధించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నవంబర్ 3వ తేదీ నుంచి కళాశాలలను బంద్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa