ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు వర్తించదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 07:20 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన దుర్ఘటన అందరి హృదయాలని కలచివేస్తోంది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొని 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కంకర లోడుతో వచ్చిన లారీ.. ఢీకొట్టడం వల్ల బస్సు సగం నుజ్జునుజ్జు అయింది. అయితే మృతుల్లో 15 నెలల పసికందు ఉండటం కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎక్స్‌గ్రేషియాతో పాటు ఎందుకు బీమ ఉండదు అనే విషయంపై అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మృతులపై ఆధారపడిన కుటంబాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటుంది.. ఆర్టీసీ ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.


ప్రస్తుతానికి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులకు ఇన్సూరెస్ వర్తించదు. టికెట్‌లో రూ.1 'సేఫ్టీ సెస్' కింద ప్రయాణీకులు కడుతున్నారు. కానీ అవి కేవలం ఎక్స్‌గ్రేషియా నిధితుల కిందకు మాత్రమే జమ అవుతాయి. మోటార్ వెహికల్ యాక్ట్, 1988 ప్రకారం రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ బస్సులు ఇది పాటిస్తున్నాయి. కానీ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థలకు మినహాయింపులు ఇస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇలాగే జరుగుతోంది. సొంతంగా ఎక్స్‌గ్రేషియా ఫండ్ ఏర్పాటు చేయడం వల్ల ఇలా మినహాయింపులు ఇస్తున్నారు.


దేశవ్యాప్తంగా చాలా ఆర్టీసీలు బాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వడంలో విఫలం అవుతున్నాయి. దీనిపై గతంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులకు సకాలంలో, వేగంగా పరిహారం ఇచ్చేందుకు థర్డ్ పార్టీ జాతీయ బీమా సంస్థల్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించింది. అయినా చాలా ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అంతేకాకుండా వేల బస్సులకు ఏటా రూ. కోట్ల రూపాయల ప్రీమియం కట్టడం.. ఆర్టీసీకి తలకుమించిన భారం అవుతుందని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు భిన్నంగా కేరళ.. 2015 నుంచి న్యూ ఇండియా అష్యూరన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతోంది. ఇక భారతీయ రైల్వే కూడా.. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసిన వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010లో ఆర్టీసీ టికెట్‌లో బీమ యాడ్ చేయాలని ప్రాణాళికలు చేశారు. దాని కోసం టికెట్ ధరలో రూ.2 నుంచి 5 వసూలు చేసి బీమ తీసుకోవాలని అనుకున్నారు. అప్పడది జరగలేదు. అనంతరం 2018లో కూడా తెలంగాణ ఆర్టీసీ ఈ మేరకు కసరత్తులు చేసింది. కానీ పలు కారణాలు వల్ల అది పట్టాలెక్కలేకపోయింది. ప్రస్తుతం ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే.. ఇన్సూరెన్స్ లేకపోయినా ఎక్స్‌గ్రేషియా వస్తోంది. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు (ప్రభుత్వం) ఇంకా, రూ. 3-5 లక్షలు (ఆర్టీసీ ఫండ్) కలిపి మొత్తం రూ. 8 నుంచి 10 లక్షలు వరకు ఆర్టీసీ ప్రయాణీకులకు పరిహారం అందుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa