తెలంగాణ రాజకీయాలు మరోసారి సుప్రీంకోర్టుకు చేరాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పిటిషన్లో పేర్కొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది.మరోవైపు, ఎమ్మెల్యేలపై విచారణకు సంబంధించి తమకు మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో, తమ ధిక్కార పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు కోరారు. తమ కేసు విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ గవాయ్... "నేను ఈ నెల 23న పదవీ విరమణ చేస్తున్నాను. ఆ తర్వాత నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు" అని వ్యాఖ్యానించారు.వాదనలు విన్న అనంతరం, ఈ పిటిషన్పై విచారణను వచ్చే సోమవారం చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్పై కూడా సోమవారం విచారణ జరగడం ఖాయమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa