తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియడంతో.. గెలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ వేవ్ కనిపిస్తోందని వెల్లడించారు. తెలంగాణలో మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాయిదా పడుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్పై కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుతామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు అంతా కలిసి చర్చించి.. ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ భేటీ 2, 3 రోజుల్లోనే జరుగుతుందని.. ఆ తర్వాత.. తెలంగాణలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలను పరిశీలించి.. ఏఐసీసీ పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని తాము అనుకున్నామని.. అయితే కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కనీసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకురావడం లేదని ఆయన మండిపడ్డారు.
ఇక మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్స్లో కాంగ్రెస్ రిగ్గింగ్కు పాల్పడిందంటూ ప్రతిపక్షాలు.. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడానికి సాధ్యపడదని.. ఇది పాత జమానా కాదని తేల్చి చెప్పారు. ఏ ఎన్నికల్లోనైనా ఓడిపోయే వాళ్లు సర్వసాధారణంగానే నిందలు వేస్తారని.. ప్రతిపక్షాల విమర్శలను ఆయన లైట్ తీసుకున్నారు.
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చాయని.. భారీ మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చేసిన కృషిని టీపీసీసీ చీఫ్ అభినందించారు. అయితే.. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయకపోవడం వల్ల పోలింగ్ శాతం తగ్గిందని.. అలా కాకుండా అంతా వచ్చి ఓటు వేస్తే.. ఓటింగ్ శాతం పెరిగి ఉండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక తనకు మంత్రి పదవి ఇవ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నకు మహేష్ కుమార్ గౌడ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చేశారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని.. టీపీసీసీ అధ్యక్షుడి పదవికే తాను మొగ్గు చూపుతానని తేల్చి చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం తన కోసం చేసింది కాదని వెల్లడించారు. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను సఖ్యతతోనే పనిచేస్తున్నానని.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫేక్ సర్వేలతో తాత్కాలిక ఆట ఆడుతోందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ కూటమి గెలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa