ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమించండి.. మళ్లీ ఇలా చేయను..ప్రకాష్ రాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 07:28 PM

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ఆటకట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం.. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను విచారణ జరిపేందుకు, వాటిపై దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపించి.. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సిట్ ఆదేశాలతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‍‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా సిట్ ముందు హాజరై తమ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్‌రాజ్‌ కూడా సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.


బుధవారం సాయంత్రం సిట్‌ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్‌రాజ్‌.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల కేసులో తన వాంగ్మూలం ఇచ్చారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయనను పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రకాష్‌రాజ్.. క్షమాపణలు చెప్పారు. 2016లో ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్.. 2017లో గేమింగ్ యాప్‌గా మారినట్లు వెల్లడించారు. దీంతో ఆ యాప్‌తో తాను చేసుకున్న ఒప్పందాన్ని అప్పుడే రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు.


అయితే తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా తప్పు తప్పేనని ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ అంగీకరించారు. కాబట్టి దీనిపై తాను క్షమాపణ కోరుతున్నానని.. ఈ బెట్టింగ్ యాప్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్లను సిట్ అధికారులకు అందించినట్లు తెలిపారు. ఎంతోమంది యువత ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. దీంతో వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.


కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందని.. కష్టపడితేనే డబ్బులు వస్తాయనిప ప్రకాష్‌రాజ్ తెలిపారు. కాబట్టి అందరం కష్టపడి పని చేసుకుందామని సూచించారు. ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన విషయంలో తనను క్షమించాలని.. ఈ సందర్భంగా మీడియా ముందు అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయనని స్పష్టం చేశారు.


బెట్టింగ్‌ యాప్‌లకు చాలా మంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంతో.. చాలా మంది యువకులు డబ్బు కోసం ఆశపడి.. వాటికి బానిసలై ప్రాణాలు తీసుకుంటున్నారని రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ కేసులను అన్నింటినీ విచారణ జరిపేందుకు.. సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో సినీ నటులు విజయ్‌ దేవరకొండతోపాటు దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa