దేశంలో డయాబెటిస్ (మధుమేహం), ప్రీడయాబెటిస్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ఒక భారీ విశ్లేషణలో తేలింది. దేశవ్యాప్తంగా పరీక్షలు చేయించుకున్న ప్రతి ఇద్దరిలో ఒకరి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ఇండియా టుడే కథనం ప్రకారం, ప్రముఖ హెల్త్కేర్ సంస్థ ఫార్మ్ఈజీ "డయాబెటిస్: ది సైలెంట్ కిల్లర్ స్వీపింగ్ అక్రాస్ ఇండియా" పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. 2021 నుంచి 2025 మధ్యకాలంలో సేకరించిన 40 లక్షలకు పైగా డయాగ్నస్టిక్ రిపోర్టులు, 1.9 కోట్ల మెడిసిన్ ఆర్డర్లను విశ్లేషించి దీన్ని రూపొందించారు.ఈ విశ్లేషణ ప్రకారం, HbA1c పరీక్ష చేయించుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్ బారిన పడగా, ప్రతి నలుగురిలో ఒకరికి ప్రీడయాబెటిస్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఒకప్పుడు వృద్ధుల వ్యాధిగా పరిగణించిన డయాబెటిస్, ఇప్పుడు యువతను కూడా వేధిస్తోంది. 30 ఏళ్లలోపు వారిలోనూ అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కనిపిస్తుండగా, 30 ఏళ్లు దాటిన తర్వాత ఈ ముప్పు గణనీయంగా పెరుగుతోందని నివేదిక హెచ్చరించింది. 60 ఏళ్లు పైబడిన వారిలో అయితే, ప్రతి 10 మందిలో 8 మంది డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు.పురుషుల్లో (51.9 శాతం) మహిళలల్లో (45.43 శాతం) కంటే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పుదుచ్చేరి (63 శాతం), ఒడిశా (61 శాతం), తమిళనాడు (56 శాతం) వంటి దక్షిణాది, తీర ప్రాంత రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. డయాబెటిస్ కేవలం రక్తంలో చక్కెర స్థాయిలకే పరిమితం కాదని, ఇది ఇతర అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని నివేదిక స్పష్టం చేసింది. డయాబెటిస్ ఉన్నవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి కాలేయ సమస్యలు, దాదాపు సగం మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa