ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదగిరిగుట్టలో కొబ్బరికాయ ధరల్లో మార్పులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 07:15 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు విక్రయించే కొబ్బరికాయల ధరలను పెంచాలని యాదగిరిగుట్ట వర్తక సంఘం ఆలయ అధికారులను కోరింది. కొండపైన కొబ్బరికాయను భక్తులకు ప్రస్తుతం రూ.40కి విక్రయిస్తున్నారు. అయితే.. బయటి మార్కెట్‌లో కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరగడంతో.. ఈ ధర తమకు నష్టాలను మిగులుస్తోందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులు గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వెంకటరావును కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. కొండపైన కొబ్బరికాయ ధరను కనీసం రూ.50 వరకు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్ట వర్తక సంఘం తమ సమస్య తీవ్రతను ఆలయ అధికారులకు వివరించింది. బయటి మార్కెట్‌లో కొబ్బరికాయల కొనుగోలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీనికి తోడు.. ఆలయ పరిసరాల్లో దుకాణాలు నడుపుతున్నందుకు వర్తక సంఘానికి కేటాయించిన మూడు షాపులకు గాను.. దేవస్థానానికి నెలకు దాదాపు రూ.4 లక్షల భారీ కిరాయిని చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు.


ఒకవైపు కొనుగోలు ధరలు, మరోవైపు ఆలయానికి చెల్లించాల్సిన అధిక అద్దె కారణంగా.. భక్తులకు రూ.40కే కొబ్బరికాయలు అమ్మడం తమకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోందని వ్యాపారస్తులు పేర్కొన్నారు. పూజా సామాగ్రి అమ్మకాలపై వచ్చే లాభం కంటే.. నష్టం ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్తక సంఘం కార్యదర్శి ఆకుల నర్సింహులు, కోశాధికారి నరసింహ, ఇతర సభ్యులు ఈ వినతిలో పాల్గొన్నారు. వర్తక సంఘం వినతిని ఆలయ ఈవో వెంకటరావు సానుకూలంగా స్వీకరించారు. కొబ్బరికాయల ధర పెంపు, వ్యాపారుల అద్దె భారం వంటి అంశాలపై ఆలయ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.


భక్తులకు సరసమైన ధరలకే కొబ్బరికాయలు అందించాలనే లక్ష్యాన్ని ఆలయం కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి.. ధరలను పెంచడానికి బదులుగా, వర్తక సంఘానికి చెల్లించాల్సిన మాసపు అద్దె (కిరాయి) విషయంలో కొంత రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. లేదా కొబ్బరికాయల సరఫరా ధరలను నియంత్రించేందుకు ఆలయమే ప్రత్యేకంగా కొనుగోలు చేసి.. తక్కువ ధరకే వ్యాపారులకు అందించే విధానంపై కూడా అధికారులు దృష్టి సారించవచ్చు. మొత్తానికి.. భక్తులకు భారం కాకుండా, వ్యాపారులు నష్టపోకుండా ఒక మధ్యే మార్గాన్ని అన్వేషించాల్సిన బాధ్యత ఆలయ నిర్వహణాధికారులపై ఉంది. ఏది ఏమైనా.. యాదగిరి గుట్టలో విక్రయించే కొబ్బరికాయ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయా..? లేదా అనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa