అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అమ్మ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. కని, పెంచిన అమ్మ కళ్ల ముందే విగతజీవిగా పడి ఉంటే.. పిల్లల అనుభవించే మనో వేదనను వర్ణించలేము. ప్రపంచమంతా అంధకారంతో నిండిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే ఓ యువతికి వచ్చింది. తల్లి దూరమైన తర్వాత ఆమె గుండె ముక్కలైంది. ఇక అమ్మ లేదు అనే నిజాన్ని జీర్నించుకోలేని ఓ కూతురు.. ఎవరూ చేయలేదని పని చేసింది. శ్మశానంలో తల్లి సమాధి వద్దే మూడు రోజుగా నిద్రిస్తోంది. కరీంనగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అజ్మత్పూర్ ప్రాంతంలో నివసిస్తున్న హసీనా అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఇటీవల ఆమె చనిపోయింది. స్థానికంగా ఉన్న సవరన్ షీట్ కబరస్థాన్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమార్తె ఆఫ్రిన్ తీవ్ర మనోవేదనకు గురైంది. అంత్యక్రియల సమయంలో కన్నీరుమున్నీరుగా విలపించింది. అంత్యక్రియల తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోయినా.. ఆఫ్రిన్ మాత్రం తల్లి సమాధి వద్దే కూర్చుని ఏడ్చింది.
కొద్ది సేపు తర్వాత అఫ్రిన్ ఇంటికి వస్తుందని అంతా భావించారు. కానీ ఆమె రాత్రంతా తల్లి సమాధి వద్దే ఉంది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు బలవంతంగా తీసుకెళ్లినా.. ఆమె మళ్లీ సమాధి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది అఫ్రిన్. ఇలా మూడు రోజులుగా శ్మశానంలోనే గడుపుతోంది. రాత్రివేళల్లో కూడా శ్మశానంలో ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఆఫ్రిన్ తండ్రి, మరికొందరు బంధువులు ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఇంట్లోనే ఉంచుతూ.. బయటకు వెళ్లనివ్వట్లేదని సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలో సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. కుటుంబాన్ని విడిచిపెట్టి తండ్రి ఎటో వెళ్లిపోయాడు. తల్లి అన్ని తానై ఇద్దరు కూతుళ్లు రవళిక (25), అశ్విత (22)ను చూసుకుంటోంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 23న తల్లి కన్నుమూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏం చేయాలో తెలియలేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారు కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ ధైర్యం చాలక, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని అలాగే ఉండిపోయారు. అనంతరం వారే.. సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వచ్చి జరిగిన విషయం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa