దక్షిణ సూడాన్లో ఓ విమానం హైజాక్ ఉదంతం సుఖాంతమైంది. సాయుధుడైన హైజాకర్ విమానాన్ని మరో దేశానికి మళ్లించాలని ఒత్తిడి చేయగా, పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, నిందితుడిని అధికారులకు పట్టించారు. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదు.మంగళవారం రాజధాని జుబా నుంచి మైవుట్కు వైద్య సామగ్రితో సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం బయలుదేరింది. టేకాఫ్కు ముందే యాసిర్ మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి తుపాకీతో విమానంలోకి ప్రవేశించి, వెనుక క్యాబిన్లో దాక్కున్నాడు. విమానం గాల్లోకి లేచిన తర్వాత బయటకు వచ్చి, దానిని ఆఫ్రికా దేశమైన చాద్కు మళ్లించాలని పైలట్ను బెదిరించాడు.ఈ అనూహ్య పరిణామంతో పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. విమానంలో ఇంధనం అయిపోతోందని, చాద్కు వెళ్లాలంటే సమీపంలోని వావు నగరంలో ఇంధనం నింపుకోవాలని హైజాకర్ను నమ్మించాడు. అదే సమయంలో రహస్యంగా అధికారులకు సమాచారం అందించాడు. విమానం వావులో ల్యాండ్ అవగానే, భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనను దక్షిణ సూడాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (SSCAA) ధ్రువీకరించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని తెలిపింది. హైజాక్కు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa