తెలంగాణలో మరోసారి గులాబీ జెండాలు రెపరెపలాడాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షత వహించారు. పార్టీ శ్రేణుల భారీ కేకలు, జై తెలంగాణ నినాదాల మధ్య ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇక్కడ కార్యకర్తలు గులాబీ జెండాల పట్టుకొని జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో.. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి కొన్ని చోట్ల గెలిచినట్లు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఎటువైపు ఉందో ఈ ఫలితాలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు కనుక పార్టీ గుర్తుపై జరిగి ఉంటే.. భారత రాష్ట్ర సమితి సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేది. గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పారు’ అని ఆయన స్పష్టం చేశారు.
కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని.. గర్వంతో విర్రవీగుతున్న పాలకులకు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారని విశ్లేషించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపైనే పోరాడతామని.. అప్పుడు అసలు బలాబలాలు తేలుతాయని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని.. దీనిపై జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు.
పార్టీ మారిన శాసనసభ్యుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కొందరు వ్యక్తులు స్వలాభం కోసం పార్టీలు మారారని.. దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో మళ్లీ పోరాడతామని కేసీఆర్ వెల్లడించారు. విలువల లేని రాజకీయాలకు అంతిమంగా ప్రజలే తీర్పు చెబుతారని హెచ్చరించారు.
గత పదేళ్లలో తెలంగాణలో ఆస్తుల విలువ విపరీతంగా పెరిగిందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల ఆస్తుల విలువ పడిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్నారు. ఇక చివరగా.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించబోతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టడానికి క్షేత్రస్థాయిలోకి వెళ్తామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa