కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతుల అంశం ఇప్పుడు ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థలకు మధ్య పెద్ద వివాదంగా మారుతోంది. బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి లేదా రిపేర్లు చేయడానికి తాము సిద్ధంగా లేమని నిర్మాణ ఏజెన్సీలు ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీలు దెబ్బతినే సమయానికే తమ ఒప్పందంలో ఉన్న 'డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్' (DLP) ముగిసిపోయిందని, కాబట్టి ఇప్పుడు చేయాల్సిన మరమ్మతులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయా సంస్థలు స్పష్టం చేసినట్లు సమాచారం.
భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో పిల్లర్లు కృంగిపోవడం, పగుళ్లు రావడం వంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పటి నుంచి మరమ్మతుల బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, నిర్మాణం పూర్తయిన కొన్ని ఏళ్లకే ఇంతటి భారీ డ్యామేజ్ జరిగినా, ఏజెన్సీలు మాత్రం సాంకేతిక కారణాలను చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం తమ బాధ్యత కాలం తీరిపోయిందని వాదిస్తూ, ఇప్పుడు సొంత ఖర్చులతో రిపేర్లు చేయడం కుదరదని ఏజెన్సీల ప్రతినిధులు అధికారులకు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఏజెన్సీల ఈ మొండి తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతటి భారీ ప్రాజెక్టు కట్టినప్పుడు నాణ్యత లోపాలు బయటపడితే, కేవలం గడువు ముగిసిందనే సాకుతో బాధ్యత నుండి తప్పుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, నాణ్యతా లోపాల వల్ల జరిగిన నష్టానికి నిర్మాణ సంస్థలు బాధ్యత వహించకుండా చేతులెత్తేయడాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏజెన్సీలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు బోగట్టా. పనులు ఎలా చేయించుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసని, అవసరమైతే చట్టపరమైన చర్యలకు (Legal Action) వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. లీగల్ గానే మీకు సమాధానం చెబుతామని, ప్రభుత్వ శక్తిని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. దీంతో రానున్న రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల అంశం న్యాయపోరాటానికి దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa