తెలంగాణ శాసనసభ వేదికగా ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆరు డీఏలు (DA) పెండింగ్లో ఉన్నాయని, గత రెండేళ్లుగా పీఆర్సీ (PRC) ఊసే లేదని ఆయన గుర్తు చేశారు. పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ నిధులను కూడా ప్రభుత్వం నిలిపివేసిందని, హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఉద్యోగులను నట్టేట ముంచిందని హరీశ్రావు విమర్శించారు.
హరీశ్రావు వ్యామర్శలపై మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా స్పందిస్తూ ప్రతిపక్షానికి ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం చూస్తుంటే 'దెయ్యాలు వేదాలు వల్లించినట్లు' ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గత పదేళ్ల పాలనలో ఉద్యోగులను ఏనాడూ పట్టించుకోని వారు, ఇప్పుడు వారి క్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, తాము ఉద్యోగుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని శ్రీధర్ బాబు హితవు పలికారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంలో జరిగిన జాప్యాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత పాలకులు నెలాఖరు వరకు, కొన్ని సందర్భాల్లో 20వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. కనీసం ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుండి నేడు తాము అధికారంలోకి రాగానే జీతాల చెల్లింపుల ప్రక్రియను క్రమబద్ధీకరించామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేని పాలన వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము అధిగమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ వాదోపవాదాలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి. అటు పెండింగ్ డీఏలు, పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తుండటంతో, ప్రతిపక్షం ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్థిక స్థితిగతులను బట్టి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం చివరకు ఉద్యోగుల ప్రయోజనాలకు ఏ విధంగా దారితీస్తుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa