ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూరియా పంపిణీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సాగు సమయం మించిపోతుండటంతో యూరియా కోసం ఎదురుచూస్తున్న తమకు, యాప్ ద్వారా పంపిణీ చేయడం వల్ల అనవసర జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల వల్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఈ సందర్భంగా వాపోయారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే, సిబ్బంది ఆన్లైన్ ప్రక్రియను సాకుగా చూపుతూ పంపిణీలో ఆలస్యం చేయడంతో రైతుల సహనం నశించింది. వెంటనే ఆన్లైన్ నిబంధనలను పక్కన పెట్టి, గతంలో లాగే నేరుగా ఆధార్ కార్డుల ఆధారంగా యూరియాను పంపిణీ చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్రం వద్ద అధికారులతో రైతులకు స్వల్ప వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
తమ డిమాండ్లకు అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు సహకార సంఘం కార్యాలయం ముందు నుంచి ప్రధాన రహదారిపైకి చేరుకుని బైఠాయించారు. రోడ్డుపైనే కూర్చుని నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరును నిరసించారు. రైతుల ఆందోళన కారణంగా మండల కేంద్రంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుక కూర్చున్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను గమనించకుండా నిబంధనలు రుద్దడం సరికాదని రైతు నాయకులు విమర్శించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కోసం ఇలా రోడ్ల మీద గడపాల్సి రావడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే యూరియా పంపిణీని సరళతరం చేయాలని, ప్రతి రైతుకు అవసరమైన మేర ఎరువులు అందేలా చూడాలని వారు కోరారు. చివరకు అధికారులు సానుకూలంగా స్పందించడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa