ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యతరగతికి బడ్జెట్ ధమాకా.. రూ.15 లక్షల వరకు నో ట్యాక్స్!

business |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 10:26 PM

దేశంలోని కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే బడ్జెట్ 2026-27లో కొత్త పన్ను విధానం ( New Tax Regime ) కింద ఆదాయపు పన్ను రాయితీలను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87A కింద ఇచ్చే పన్ను రిబేటు పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే గణనీయంగా పెంచి దాదాపు రూ. 1.5 లక్షల వరకు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఏమిటీ సెక్షన్ 87A మార్పు? ఎవరికి లాభం?


ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేటు లభిస్తోంది (గతంలో ఇది రూ. 7 లక్షలుగా ఉండేది). అయితే, రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పరిమితిని మరింత విస్తరించాలని భావిస్తోంది. సెక్షన్ 87ఏ రిబేట్ కారణంగా రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ పడడం లేదు. అయితే సెక్షన్ 87A రిబేటును పెంచడం ద్వారా, రూ. 15 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు కూడా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేని పరిస్థితి కల్పించనున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.


ఉద్యోగులకు కేవలం 87A రిబేటు మాత్రమే కాకుండా, స్టాండర్డ్ డిడక్షన్ కూడా తోడవుతుంది. ఇప్పటికే ఈ పరిమితిని రూ. 75,000కు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 87A రిబేటు కూడా పెరిగితే రూ. 15 లక్షల ప్యాకేజీ ఉన్న సామాన్య ఉద్యోగి చేతికి పూర్తి జీతం అందే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజల వద్ద ఖర్చు చేయడానికి ఎక్కువ నగదు మిగులుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోందట.


నిపుణులు ఏమంటున్నారు?


పన్ను నిపుణులు, ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం పాత పన్ను విధానం కంటే కొత్త పన్ను విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెక్షన్ 87A రిబేటు పెంపునకు బదులుగా పన్ను లెక్కలు చాలా సరళంగా మార్చవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లోనే సెక్షన్ 87ఏ రిబేట్ భారీగా పెంచారు. దీంతో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.12 లక్షలకు చేరింది. దీంతో ఈసారి ఈ పరిమితిని పెంచకపోవచ్చంటున్నారు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసి, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు రిబేట్ పెంచే అవకాశం లేకపోలేదంటున్నారు.


ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. ప్రజల చేతుల్లో డబ్బు ఎక్కువగా ఉంటే, మార్కెట్‌లో వస్తువుల కొనుగోలు పెరిగి డిమాండ్ పెరుగుతుంది. వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పై సామాన్యుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ సెక్షన్ 87A రిబేటును రూ. 1.5 లక్షలకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే, భారత పన్ను చరిత్రలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. పన్నుల భారం తగ్గుతుందన్న వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ప్రైవేటు రంగ కార్మికులు హర్షం వ్యక్తం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa