ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 చుట్టూ ప్రస్తుతం ఓ పెద్ద హై డ్రామా కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో తలనొప్పిగా మారిన ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కూడా మరో మెలిక పెట్టిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన భద్రతా సమస్యలు పరిష్కారం కాకపోతే, తాము కూడా టోర్నీలో పాల్గొనాలా వద్దా అన్న అంశాన్ని పునఃసమీక్షిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసినట్లు జియో న్యూస్ నివేదించింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీపై ఇప్పటికే తీవ్ర గందరగోళం నెలకొంది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రతా అంశాలపై పాకిస్తాన్ను సంప్రదించి మద్దతు కోరిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనం వెల్లడించింది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను తొలగించాలంటూ బీసీసీఐ సూచించిన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ఆ నిర్ణయానికి ఎలాంటి అధికారిక కారణం వెల్లడించలేదు.
దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. అలాగే టీ20 వరల్డ్కప్ మ్యాచ్లను భారత్లో ఆడలేమంటూ, భద్రతా కారణాలు చూపుతూ ఐసీసీకి అధికారికంగా లేఖ రాసింది. అప్పటి నుంచి తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ స్పష్టంగా చెబుతోంది.
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్, ఏ దేశంపైనా ఆతిథ్య బాధ్యతల విషయంలో ఒత్తిడి లేదా బెదిరింపులు ఉండకూడదని వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్కు పూర్తి మద్దతు ఉంటుందని కూడా తెలిపింది. అంతేకాదు, బంగ్లాదేశ్ కోరితే వారి టీ20 వరల్డ్కప్ మ్యాచ్లన్నింటినీ పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధమని ఇప్పటికే ఐసీసీకి తెలియజేసినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
ముంబై, కోల్కతాలో జరగాల్సిన మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలంటూ బంగ్లాదేశ్ ఐసీసీని కోరిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చిందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ మహిళల క్వాలిఫయర్లను విజయవంతంగా నిర్వహించిన అనుభవం తమకు ఉందని, అవసరమైతే మైదానాలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ పేర్కొంది.
ఇదే సమయంలో బంగ్లాదేశ్ గ్రూప్ మార్పు అంశంపై కూడా చర్చ జరిగింది. శ్రీలంకలోనే తమ గ్రూప్ మ్యాచ్లన్నీ ఆడాల్సిన ఐర్లాండ్తో గ్రూప్ మార్పు ప్రతిపాదనను బంగ్లాదేశ్ ముందుకు తెచ్చింది. అయితే షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందని క్రికెట్ ఐర్లాండ్ ఇప్పటికే వెల్లడించింది. ఈ పరిణామాలన్నింటితో టీ20 వరల్డ్కప్ 2026పై ఉత్కంఠ మరింత పెరిగింది. బంగ్లాదేశ్ నిర్ణయం మాత్రమే కాకుండా, ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి కూడా ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. అయితే, జనవరి 21 వరకు బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్లైన్ విధించింది. తమ నిర్ణయాన్ని ఆ లోపు చెప్పాలంటూ ఐసీసీ తేల్చి చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa