ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

international |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 08:50 PM

అంతర్జాతీయ దౌత్యం, శాంతి చర్చల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన గాజా పునర్నిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల నివారణ కోసం ఆయన ప్రతిపాదించిన 'బోర్డ్ ఆఫ్ పీస్' ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ బోర్డులో సభ్యత్వం కేవలం ఆహ్వానంతోనే ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇందులో సభ్యత్వం కోసం సదరు దేశాలు భారీ మెంబర్‌షిప్ ఫీజు కట్టాలనే నిర్ణయం ఉన్నట్లు బయటకు రావడంతో.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


బిలియన్ డాలర్ల ఎంట్రీ ఫీజు!


న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. ఈ బోర్డులో చేరే దేశాలు తమ సభ్యత్వాన్ని మూడేళ్ల కాల పరిమితి దాటి పొడిగించుకోవాలంటే మొదటి ఏడాదిలోనే కనీసం 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,098 కోట్లు) విరాళాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ భారీ నిధులను యుద్ధ ప్రాంతాల అభివృద్ధికి, శాంతి భద్రతల పర్యవేక్షణకు వినియోగించనున్నారు.


గాజా కోసం మొదలై.. ప్రపంచవ్యాప్త వ్యూహంగా!


మొదట ఈ బోర్డును గాజాలో యుద్ధానంతర పరిపాలన పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. తాజాగా విడుదలైన ముసాయిదా చార్టర్‌లో 'గాజా' అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీనిని బట్టి చూస్తుంటే.. ట్రంప్ ఈ బోర్డుకు మరింత విస్తృతమైన అధికారాలను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఘర్షణలు జరిగినా ఈ బోర్డు జోక్యం చేసుకునే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తులో 'ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి' (UNSC) కి అమెరికా నేతృత్వంలోని ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ ప్రతిష్టాత్మక బోర్డులో భాగస్వాములు కావాలని భారత్, పాకిస్థాన్, కెనడా, ఈజిప్ట్, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాలకు అధికారిక ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే అల్బేనియా ప్రధాని ఎడి రామా, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి వంటి నాయకులు తమ ఆహ్వానాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.


బోర్డులో కీలక సభ్యులు వీరే..


ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహించనున్న ఈ బోర్డులో ప్రపంచ స్థాయి ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ వంటి వాళ్లంతా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ బోర్డు ఏడాదికి కనీసం ఒకసారి సమావేశమై కీలక నిర్ణయాలపై ఓటింగ్ నిర్వహించనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డుగా దీనిని ట్రంప్ అభివర్ణిస్తున్నారు. అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ వంటి దేశాలు ఈ బిలియన్ డాలర్ల నిబంధనను ఎలా అధిగమిస్తాయి? స్వతంత్ర విదేశాంగ విధానం కలిగిన భారత్ ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa