ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులన్నీ మతపరమైనవి కాదు',,,,మహ్మద్ యూనిస్

international |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 08:49 PM

దాదాపు ఏడాదిన్నర కాలంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా వందల దాడులు జరిగాయి. హిందూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న వార్తలు వచ్చాయి. ఇటీవల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడైన దీపు చంద్ర దాస్‌ అనే హిందూ వ్యక్తిపై.. దైవ దూషణ ఆరోపణలతో అక్కడి అల్లరి మూకలు దాడిచేశాయి. విచక్షణారహితంగా కొట్టి చంపి.. అతడి శవాన్ని జాతీయ రహదారిపైకి ఈడ్చుకొచ్చి రోడ్డు మధ్యలో చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు.


దీపు చంద్రదాస్ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్‍పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. యావత్తు ప్రపంచం బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో కూడా ఈ ఘటన సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి అనేక హిందూ సంఘాలు. ఈ నేపథ్యంతో భారత్ కూడా బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో తాజాగా ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనిస్ సంచలన ప్రకటన విడుదల చేశారు.


2025లో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరిగిన దాడులపై మహ్మద్ యూనిస్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. గతేడాది తమ దేశంలో మైనారిటీలకు సంబంధించిన ఘటనల్లో.. చాలా వరకు నేరపూరిత స్వభావం కలిగినవారు చేసినవే అని పేర్కొంది. అంతేకాకుండా ఆ దాడులకు మతపరమైన ఉద్దేశాలు కారణం కాదని చెప్పింది. మైనారిటీలకు సంబంధించి గతేడాది 645 ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. అందులో 71 ఘటనల్లో మాత్రమే మతపరమైన కోణాలు ఉన్నట్లు పేర్కొంది.


కాగా, హిందూ ఆలయాలపై జరిగిన దాడులకు సంబంధించి 38 ఘటనలు నమోదైనట్లు చెప్పింది మహ్మద్ యూనిస్ కార్యాలయం. ఇక మతపరమైన 71లో దాడుల్లో 50 ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపింది. దాదాపు ఇదే సంఖ్యలో నిందితులను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించింది. మిగతా 21 ఘటనల్లో తగు చర్యలు తీసుకున్నారని.. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.


మహ్మద్ యూనిస్ విడుదల చేసిన ఈ గణాంకాలను బంగ్లాదేశ్‌ హిందూ బుద్ధిస్ట్‌ క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ ( బీహెచ్‌బీసీయూసీ ) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్థులను మరింత ప్రోత్సహిస్తాయని మండిపడింది. అంతేకాకుండా అలాంటి వారికి శిక్ష పడదనే భావనను కలిగిస్తాయని హెచ్చరించింది. కాగా, బంగ్లాదేశ్ విడుదల చేసిన గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa