ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉచిత సేవలు బంద్.. ఇకపై ఛార్జీలు కట్టాల్సిందే

business |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 10:36 PM

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కోట్లాది మంది వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇన్నాళ్లు ఉచితంగా సేవలందుకుంటున్న లావాదేవీలపై ఛార్జీలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును బ్యాంక్ రద్దు చేస్తూ కొత్త సేవా రుసుములను ఖరారు చేసింది. సవరించిన కొత్త ఛార్జీలను ఫిబ్రవరి 15, 2026 నుంచి అమలులోకి తీసుకొస్తామని ప్రకటన చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


సాధారణంగా తక్షణమే డబ్బులు పంపడానికి ఐఎంపీఎస్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా యూపీఐ పరిమితి దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కీలకం. అయితే, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు కాపరణంగా ఆన్‌లైన్ ఛానెళ్ల ద్వారా (ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్) జరిపే భారీ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఫిబ్రవరి 15, 2026 నుంచి అమలులోకి వచ్చే నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు అమౌంట్ బట్టి ఛార్జీలు వర్తిస్తాయి.


రూ. 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు (ఉచితం)


రూ. 25,001 నుంచి రూ. 1 లక్ష వరకు రూ. 2 + జీఎస్‌టీ (GST)


రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రూ. 6 + జీఎస్‌టీ


రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రూ. 10 + జీఎస్‌టీ


బ్రాంచ్ ద్వారా చేసే లావాదేవీలపై మార్పు లేదు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా ఐఎంపీఎస్ లావాదేవీలు చేసే వినియోగదారులకు పాత ఛార్జీలే వర్తిస్తాయి. అందులో ఎలాంటి మార్పు చేయలేదు. బ్రాంచ్ లావాదేవీలకు రూ. 2 నుంచి రూ. 20 వరకు ( నగదు మొత్తాన్ని బట్టి) ఛార్జీలు వసూలు చేస్తారు. అందరిపై భారం పడకుండా స్టేట్ బ్యాంక్ కొన్ని రకాల ఖాతాలకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. శాలరీ ప్యాకేజీ ఖాతాలైన డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే, పోలీస్ వంటి శాలరీ అకౌంట్లు ఉన్నవారికి ఈ ఛార్జీలు వర్తించవు.


మరోవైపు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్, ఎస్బీఐ రిష్టే వంటి ప్రత్యేక ఖాతాదారులకు ఐఎం‌పిఎస్ సేవలు యథావిధిగా ఉచితంగానే అందుతాయని బ్యాంక్ తెలిపింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూనే, అధిక విలువ కలిగిన లావాదేవీలపై నామమాత్రపు ఛార్జీలను ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంక్ తన ఆదాయ వనరులను పెంచుకోవాలని చూస్తోంది. అయితే రూ. 25,000 లోపు చేసే ఆన్‌లైన్ బదిలీలు ఉచితంగానే ఉండటం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. ఎస్బీఐ వినియోగదారులు ఫిబ్రవరి 15 లోపే తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ ఛార్జీల మార్పుతో పాటు, ఏటీఎం ట్రాన్సాక్షన్ నిబంధనలను కూడా బ్యాంక్ ఇప్పటికే కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa