ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్ వెళ్లిపోయిన కోహ్లీ.. రిటర్న్ ఎప్పుడంటే..?

sports |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 08:43 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురుకావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లే విమానాన్ని కోహ్లీ ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన భారత్ 296 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి శతకం బాదుతూ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. నితీష్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ భారత్‌కు విజయం దక్కలేదు. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2తో న్యూజిలాండ్‌కు కోల్పోయింది. భారత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.లండన్‌లో కాపురం రాబోయే ఐదు నెలల పాటు టీమిండియాకు వన్డే మ్యాచ్‌లు లేకపోవడంతో విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. తమ పిల్లలు వామిక, అకాయ్‌లకు సెలెబ్రిటీ హోదా లేకుండా సాధారణ జీవితం అందించాలనే ఉద్దేశంతో, మీడియా దృష్టికి దూరంగా ఉండాలని కోహ్లీ–అనుష్క శర్మలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే అతడి ప్రధాన లక్ష్యంగా ఉంది.ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ, మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి పాత కోహ్లీని తలపిస్తూ వరుసగా రాణిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో తొలి వన్డేలో 93 పరుగులు, చివరి మ్యాచ్‌లో 124 పరుగులు చేసి తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించాడు.కోహ్లీ రిటర్న్ ఎప్పుడు?టీమిండియాకు రాబోయే ఐదు నెలల పాటు వన్డే మ్యాచ్‌లు లేకపోవడంతో కోహ్లీ కొంతకాలం లండన్‌లోనే ఉండనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 14న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్ తొలి వన్డే ఆడనుంది. ప్రస్తుతం భారత జట్టు దృష్టి అంతా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. అలాగే జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను కూడా ఆడనుంది. ఈ ప్రపంచకప్ ముగిసిన అనంతరం మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.ఐపీఎల్‌లో పాల్గొనేందుకు మార్చిలో విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రానున్నాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్‌కు కోహ్లీ హాజరయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa