భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా ఓడిపోయింది. అయితే, ఇండోర్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన ఆ పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో ఇండోర్ నగరంలో కలుషిత తాగునీటి కారణంగా చోటుచేసుకున్న విషాద ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దాంతో భారత జట్టు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంది.
టీమిండియా ఇండోర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది. అయితే హోటల్ వర్గాల సమాచారం ప్రకారం, కెప్టెన్ శుభ్మన్ గిల్ దాదాపు రూ.3 లక్షల విలువైన ప్రత్యేక వాటర్ ప్యూరిఫికేషన్ మెషీన్ను వెంట తెచ్చుకున్నాడు. ఈ యంత్రం ఆర్వో నీరు, ప్యాకేజ్డ్ బాటిల్ నీటిని కూడా మరోసారి ప్యూరిఫై చేసే సామర్థ్యం కలిగి ఉంది. గిల్ తన వ్యక్తిగత గదిలోనే ఈ పరికరాన్ని అమర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై టీమిండియా మీడియా మేనేజర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇది ఇండోర్లో ఇటీవల చోటుచేసుకున్న నీటి కాలుష్య మరణాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమా? లేక సాధారణ వ్యక్తిగత భద్రతా చర్యల్లో భాగమా? అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. హోటల్తో పాటు స్టేడియంలో కూడా తాగునీటి విషయంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, భారత జట్టు వాళ్ల జాగ్రత్తల్లో వాళ్లు ఉన్నారు. ప్యాకేజ్డ్ వాటర్, ఆర్వో సిస్టమ్లు అందుబాటులో ఉన్నా, ఎలాంటి అనవసర ప్రమాదాలకు అవకాశం ఇవ్వకూడదన్నదే జట్టు ఆలోచనగా తెలుస్తోంది.
ఇలాంటి జాగ్రత్తలు టీమిండియాకు కొత్తేమీ కాదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఆరోగ్యం విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో తెలిసిందే. హైడ్రేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపే కోహ్లీ, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసే ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగడం అలవాటుగా పెట్టుకున్నాడు.
ఇండోర్లోని భగీరథ్పుర ప్రాంతంలో కలుషిత నీటి కారణంగా ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్లు సమాచారం. హైకోర్టులో ప్రభుత్వం అధికారికంగా 15 మరణాలను అంగీకరించగా, 21 కుటుంబాలకు పరిహారం అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరిని జనరల్ వార్డుకు మార్చగా, ముగ్గురు ఇంకా వెంటిలేటర్పైనే ఉండటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa