మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పరిచయమై అమాయక యువతీ యువకులను మోసం చేసే ముఠాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అబ్బాయి కోసం మాట్రిమోనీలో వెతికే అమ్మాయిలను.. అమ్మాయిల కోసం వెతికే అబ్బాయిలే లక్ష్యంగా భారీగా ఆర్థిక మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి ఘరానా మోసానికి గురై ఏకంగా రూ. 1.53 కోట్లు పోగొట్టుకుంది. నగరంలోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో నివసించే 29 ఏళ్ల నవ్య శ్రీ అనే యువతికి.. ఒక్కలిగ మ్యాట్రిమోనీలో విజయ్ రాజ్ గౌడ అలియాస్ విజేత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను బాగా డబ్బున్న వ్యక్తిని అని ఆమెను నమ్మించి.. ఆమెతోపాటు, ఆమె కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. అసలు విషయం తెలిసేసరికి వారంతా అవాక్కయ్యారు.
తనను తాను పెద్ద బిజినెస్మెన్గా పరిచయం చేసుకున్న విజయ్.. తన వద్ద క్రషర్లు, లారీలు, రాజాజీనగర్, సదాశివనగర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములు ఉన్నాయని వారిని నమ్మించాడు. అంతేకాకుండా వీఆర్జీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక కంపెనీ కూడా ఉందని చెప్పాడు. తన వద్ద ఉన్న మొత్తం ఆస్తి విలువ రూ. 715 కోట్లు అని వారిని బురిడీ కొట్టించాడు. ఇక వారికి నమ్మకం కుదర్చడం కోసం 2019 నాటి ఒక ఈడీ కేసుకు సంబంధించిన నకిలీ బెయిల్ పత్రాలను కూడా చూపించాడు. అంతేకాకుండా నవ్య శ్రీని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిసి వారికి దగ్గరయ్యాడు.
2024 ఏప్రిల్లో నవ్య శ్రీ వద్ద నుంచి రూ. 15 వేలను ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. ఆ తర్వాత తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని.. తన బిజినెస్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నవ్య శ్రీని నమ్మించాడు. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ నుంచి కూడా సుమారు రూ. 89 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా నవ్య శ్రీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనపై కోర్టు కేసులు ఉన్నాయని.. అవి క్లియర్ అయితేనే ఆస్తులు చేతికి వస్తాయని నమ్మించి వారి రిటైర్మెంట్ ఫండ్ నుంచి రూ. 28.5 లక్షలు తీసుకున్నాడు. నవ్య శ్రీ నగలను తాకట్టు పెట్టి మరో రూ. 10 లక్షలు తీసుకున్నాడు.
డబ్బు తిరిగి ఇవ్వమని నవ్య శ్రీ ఒత్తిడి చేయడంతో ఆమె విజయ్ ఇంటికి వెళ్లింది. అక్కడే ఆమెకు అసలు షాక్ తగిలింది. విజయ్కి అప్పటికే పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే.. గతంలో తనకు చెల్లెలు అని పరిచయం చేసిన మహిళే విజయ్కి భార్య అని తెలుసుకుని మరింత షాక్కు గురైంది. వారి నుంచి మొత్తం రూ. 1.75 కోట్లు వసూలు చేయగా.. కేవలం రూ. 22 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి.. మిగిలిన రూ. 1.53 కోట్లు ఎగ్గొట్టాడు. పూర్తిగా మోసపోయామని గుర్తించిన బాధితురాలు నవ్య శ్రీ.. పోలీసులను ఆశ్రయించగా విజయ్, అతని తండ్రి, భార్యపై కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa