చైనాలో జనాభా క్షీణత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా దేశ జనాభా గణనీయంగా తగ్గింది. 2025 సంవత్సరానికి సంబంధించిన అధికారిక డేటాను చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే జనాభా 33.9 లక్షలు తగ్గి, మొత్తం 140.5 కోట్లకు చేరింది. 1949 తర్వాత దేశంలో జననాల రేటు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎన్బీఎస్ గణాంకాల ప్రకారం 2025లో చైనాలో 79.2 లక్షల జననాలు నమోదు కాగా, 1.13 కోట్ల మరణాలు సంభవించాయి. జననాల రేటు ప్రతి 1000 మందికి 5.63గా నమోదైంది. ఇది 2024లో నమోదైన 95.4 లక్షల జననాలతో పోలిస్తే 17 శాతం తక్కువ. అదే సమయంలో, మరణాల రేటు ప్రతి 1000 మందికి 8.04కి పెరిగింది. ఇది 1968 తర్వాత అత్యధికం.జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించినప్పటికీ ఫలితాలు కనిపించడం లేదు. పిల్లల పెంపకానికి ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు వంటివి అమలు చేస్తున్నా, యువత పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 32.3 కోట్లకు (మొత్తం జనాభాలో 23 శాతం) చేరింది. అదే సమయంలో, పనిచేసే వయసు (16-59 ఏళ్లు) వారి జనాభా 60.6 శాతానికి పడిపోయింది.ఈ గణాంకాలపై ఎన్బీఎస్ అధికారి వాంగ్ పింగ్పింగ్ స్పందిస్తూ.. "చైనా జనాభా ఇప్పటికీ చాలా పెద్దది... జనాభా నాణ్యత మెరుగుపడుతోంది" అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa