మధిర మున్సిపాలిటీ పరిధిలోని 17, 18, 21వ వార్డుల్లో బుధవారం మాజీ జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగట్టే 'బాకీ కార్డులను' స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా సామాన్యులకు ఒరిగిందేమీ లేదని, క్షేత్రస్థాయిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఈ పర్యటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లక్ష్యంగా కమల్ రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని, వాటి అమలులో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ఆయన నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే అప్పట్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను విస్మరించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మధిర నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే అధికార పార్టీకి ఒక్కసారిగా అభివృద్ధి పనులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని కమల్ రాజు ఎద్దేవా చేశారు. ఇప్పుడు చేస్తున్న శంకుస్థాపనలు కేవలం ఎన్నికల స్టంట్లు మాత్రమేనని, ఓట్లు వేయించుకున్నాక ఈ పనులు మళ్లీ మూలన పడతాయని ఆయన హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు ఈ గారడీ విద్యలను గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పేదల సొంతింటి కల అయిన ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అర్హులైన పేదలకు మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లను ఎందుకు మంజూరు చేయడం లేదని, ఆ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందని డిమాండ్ చేశారు. నిరుపేదల ఆశలతో ఆడుకోవడం మానుకోవాలని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa