ఖమ్మం జిల్లా కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులు ఎంతో అభివృద్ధి చెందాయి. గత కొన్నేళ్లుగా ఖమ్మం పరిసరాల్లోని చిన్న రోడ్లు సైతం విశాలమైన హైవేలుగా మారి నగరం రూపురేఖలను మార్చేశాయి. అయితే.. ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉన్న చింతకాని మండలంలోని గ్రామీణ రహదారులు మాత్రం చాలా కాలంగా అధ్వానంగా ఉన్నాయి. అటు వైపు వెళ్లాలంటేనే ‘బాబోయ్’ అనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ మండలం మధిర నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎట్టకేలకు ఈ ప్రాంత రహదారుల అభివృద్ధికి భారీగా నిధులను మంజూరు చేశారు.
చింతకాని మండలంలోని పది ప్రధాన గ్రామీణ లింక్ రోడ్ల దుస్థితిని వివరిస్తూ.. మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. స్పందించిన భట్టి విక్రమార్క.. ఈ రహదారుల పునర్నిర్మాణానికి, మరమ్మతులకు రూ.56.60 కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో పది గ్రామీణ రోడ్లకు రూ.54 కోట్లు కాగా, రాంపురం–పాతర్లపాడు ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ రోడ్డు నిర్మాణానికి రూ.2.60 కోట్లు కేటాయించారు.
చింతకాని మండలంలో ఏ రోడ్డుకు ఎంత మొత్తం ఖర్చు చేయనున్నారంటే.. మత్కేపల్లి–పందిళ్లపల్లి (న్యూ మార్కెట్) వరకు రోడ్లకు రూ.4.50 కోట్లు, నాగులవంచ రైల్వే కాలనీ నుంచి అండర్పాస్ వరకు రూ.5.00 కోట్లు, కొమట్లగూడెం నుంచి రెడ్డిగూడెం వరకు రూ.7.00 కోట్లు, ప్రొద్దుటూరు నుంచి నేరడ వరకు నిర్మించే రోడ్డుకు రూ.7.00 కోట్లు, లచ్చగూడెం నుంచి అనంతారం వరకు రూ.7.00 కోట్లు, చిన్నమండవ - నాగులవంచ - చొప్పకట్లపాలెం లింక్ రోడ్డుకు రూ.7.00 కోట్లు, నాగులీగొండ నుంచి తూటికుంట్ల వరకు రూ.5.25 కోట్లు, నేరడ నుంచి లచ్చగూడెం స్టేడియం వరకు రూ.5.50 కోట్లు, అంజనాపురం నుంచి అనంతసాగర్ వరకు రూ.4.00 కోట్లు, వందనం నుంచి నేరడ పీఆర్ రోడ్డు వరకు రూ.1.75 కోట్లు కేటాయించారు.
చింతకాని మండలంలో రహదారుల అభివృద్ధి ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా.. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న రైతులు తమ పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తరలించాలంటే ఈ లింక్ రోడ్లే కీలకం. గుంతలమయమైన రోడ్ల వల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు సమయం వృథా అయ్యేది. ఇప్పుడు కొత్త రోడ్ల వల్ల రైతులకు మేలు జరుగుతుంది.
రాంపురం–పాతర్లపాడు ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ రోడ్డుకు నిధులు కేటాయించడం వల్ల వందలాది మంది విద్యార్థులకు ప్రయాణం సులభతరం అవుతుంది. గ్రామాల మధ్య అనుసంధానం పెరగడం వల్ల అత్యవసర వైద్య సేవల కోసం ప్రజలు త్వరగా పట్టణాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నిధులను మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చింతకాని మండల ప్రజలు, నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa