చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతుంటారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సినీ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా సలహాలు, సూచనలు ఇస్తుంటారని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని అన్నారు.తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను కేంద్రంగా చేయాలనేది తమ ప్రభుత్వం సంకల్పమని అన్నారు. ఈ మేరకు బ్లూప్రింట్ సిద్ధం చేశామని తెలిపారు.సినిమా రంగం ద్వారా సామాజిక సందేశాలు ఇవ్వడంతో పాటు వాణిజ్య పరంగా లబ్ధి పొందవచ్చని అన్నారు. చిత్ర పరిశ్రమ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలిపారు. పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రత్యేకంగా చెప్పమన్నారని తెలిపారు. వారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున వారి తరఫున చెబుతున్నానని అన్నారు. గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు ఓ బాధ్యతగా స్వీకరించారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa