ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికల్లో,,,,,ఓటుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డెక్కిన మహిళలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 07:36 PM

సాధారణంగా ఎన్నికలు అంటే అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వారినిప ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఓటర్లకు మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోతారు. వాళ్లకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా మనకే ఓటు వేస్తారు అనే నమ్మకంతో కొందరికి.. మరికొందరికైతే వాళ్లకి డబ్బులు ఇచ్చినా మనకు ఓటు వేయరు అని ముందే డిసైడ్ అయ్యి ఇవ్వకుండా వెళ్తారు. గతంలో అంటే డబ్బులు వచ్చినా రాకున్నా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం తమకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటూ.. బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.


జనగామ మున్సిపాలిటీలోని 23వ వార్డు పరిధికి చెందిన కొంతమంది ఓటర్లు.. ఆందోళనకు దిగారు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు.. వాళ్లు ఆందోళన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వార్డులోని సరస్వతి స్కూల్ పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న కొందరు మహిళా ఓటర్లు.. తమ వార్డులో కొందరికి మాత్రమే ఓటు వేయమని డబ్బులు ఇచ్చారని.. తమకు మాత్రం ఇవ్వలేదని వారు ఆందోళనకు దిగారు.


జనగామ పురపాలిక 23వ వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి.. అందరికీ డబ్బులు పంచలేదని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకున్నామని.. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం తమకు డబ్బులు ఇవ్వకుండా కొందరికే పంపిణీ చేశారని మహిళా ఓటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు ఆందోళన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకోకూడదని.. పారదర్శకంగా, అభివృద్ధి చేసే నాయకులకు ఓటు వేయాలని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. అభ్యర్థులను తిడుతున్నారు. అందరికీ డబ్బులు పంచకుండా కొందరికి పంచడం పట్ల వారిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓటు వేసేందుకు డబ్బు ఇవ్వాలంటూ.. పార్టీ నాయకులు, అభ్యర్థుల ఇళ్లకు ఓటర్లు వెళ్లి డిమాండ్లు చేసిన సంఘటనలు చూశాం. కానీ ఇలా ఎన్నికల రోజు నేరుగా పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటర్లు ఆందోళనకు దిగడం తీవ్ర చర్చకు దారి తీసింది.


మరోవైపు.. తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడా ఉద్రిక్తతలు, గొడవలు చోటు చేసుకోలేదని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa