ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నిన్ను చూడాలి నాన్నా.. అమ్మ అనారోగ్యంతో ఉంది'.. కంటతడి పెట్టిస్తున్న మావోయిస్టు గణపతి కుమారుడి ఆడియో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 06:14 PM

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీ నాటికి భారత్‌ను మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తామని.. స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇప్పటికే అనేక సార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారీగా మావోయిస్ట్‌లు.. వనాలు వీడి జనాల్లోకి వచ్చి.. పోలీసుల ముందు లొంగిపోతున్నారు. మరోవైపు.. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే వందల మంది నక్సల్స్ చనిపోయారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు సైతం కొందరు నేలకొరగడం, మరికొందరు ప్రభుత్వాల ముందు లొంగిపోవడంతో.. దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీలో కీలక నేత గణపతి ఆచూకీ దొరకబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.


మావోయిస్ట్ గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మావోయిస్ట్‌లపై దాడులు జరుగుతుండటంతో గణపతి.. నేపాల్ వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చిన గణపతి.. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చారని.. త్వరలోనే కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే గణపతి కుమారుడు ముప్పాళ్ల వాసుదేవరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో వైరల్ కావడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే గణపతి సోదరుడు రామచంద్ర రావు సైతం అన్నయ్యా లొంగిపో అని రిక్వెస్ట్ చేశారు.


ఇక ఆ ఆడియోలో గణపతి కుమారుడు మాట్లాడిన మాటలు.. ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉన్నాయి. 'తండ్రి ప్రేమ తెలిసిన వాడి మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాడి మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాడి భావాలు ఎలా ఉంటాయి. మనం కలిసి ఉంటే బహుశా నాన్నా అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్నా అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ.. అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది.'


'ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు.. మీకు ఉన్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ పంథాల్లో సేవ చేస్తూ.. మావోయిజం అంటే గణపతి.. గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా.. నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు.'


'ప్రతీ కుటుంబం చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా.. నీకు వందనం. నాన్నా.. మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది. ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది.'


'మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది.'


'నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా.. మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.'


'ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష.. స్వస్తి’’ అంటూ తన 4.18 నిమిషాల ఆడియోను ముగించారు.


గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లాలోని బీర్పూర్. గణపతి లొంగిపోవాలని కోరుతూ.. 2018లోనే అప్పటి జిల్లా ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ గ్రామంలో అంతర్మథనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్పూర్‌లో బస చేసిన ఎస్పీ.. గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa