అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో దాడి చేస్తోంది. ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగింది. అరబ్ దేశాల్లోని అమెరికా స్థానిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఇలా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడవచ్చంటూ గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. లీటర్ పెట్రోల్ రూ.500 అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆందోళన చెందుతున్న వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. పాతబస్తీలోని పెట్రోల్ బంకుల్లో అయితే గంటల తరబడి నిలబడి వాహనాలతో పాటు, బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ నింపుకొని నిల్వ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, పెట్రోల్ కొరతపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. పెట్రోల్ సరఫరాలో ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని వాహనదారులు ఈ పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. అమరేందర్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా స్థిరంగా ఉందని చెప్పారు. కనీసం ఒక నెల పాటు సరిపోయే ఇంధన నిల్వలు మన వద్ద ఉన్నాయన్నారు. యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతింటుందనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చునని.. అది నేరుగా రిటైల్ అవుట్లెట్లలో తక్షణ కొరతకు దారితీయదని బాలానగర్కు చెందిన డీలర్ రాజీవ్ అమరం స్పష్టం చేశారు.
పెట్రోల్ కొరత వదంతుల ప్రభావంతో గడిచిన రెండు రోజుల్లో ఇంధన విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. పంజాగుట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకోవడం కనిపించిందని అంటున్నారు. భారత ప్రభుత్వం వివిధ దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని.. సరఫరా గొలుసు చాలా పటిష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెంచవద్దని వారు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa