గతంలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి.. యావత్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలకు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపరిచిన ఈ కొవిడ్ వైరస్.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మహమ్మారి.. బర్డ్ ఫ్లూ అని హెచ్చరించారు. అయితే ఇప్పటికే బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతోంది. భారత్తోపాటు అనేక దేశాల్లోనూ బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో తీవ్ర బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడం తీవ్ర కలవరం రేపుతోంది. కొవిడ-19 తర్వాత ప్రబలే మరో మహమ్మారి ఈ బర్డ్ ఫ్లూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బర్డ్ ఫ్లూ వైరస్.. మహమ్మారిగా మారేందుకు అనువుగా మార్పులు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అమెరికా లూసియానాలో ఒక రోగికి ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) యొక్క తీవ్రమైన ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. ఇది అమెరికాలో గుర్తించిన తొలి తీవ్రమైన కేసు అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-సీడీసీ బుధవారం ప్రకటించింది. ఈ కేసుతో 2024లో అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 61కి పెరిగింది. ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తి.. చనిపోయిన పక్షులతో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఇక ఈ హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 రకం జన్యురూపం ఇటీవల అమెరికాలోని అడవి పక్షులు, ఫౌల్ట్రీ ఫామ్లలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. వాషింగ్టన్ రాష్ట్రంతో పాటు కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్లో మానవ కేసుల్లో ఈ జన్యురూపాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి వ్యాపించడాన్ని సూచించే తగిన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని అధికారులు చెప్పడం కొంత ఊరటనిస్తోంది.
ఈ బర్డ్ ఫ్లూను సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్గా పిలుస్తారు. ఈ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. ఇన్ఫ్లూయంజా టైప్-ఏలో 12 కుపైగా వైరస్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీ కోళ్లకు వస్తాయని పేర్కొ్న్నారు. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ హెచ్5ఎన్1 రకాన్ని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లో తొలిసారి గుర్తించింది. ఇక భారత్లో మాత్రం 2006లో ఈ బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019 లో మొట్టమొదటిసారి మనుషుల్లో గుర్తించారు. భారత్లో ఏటా వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa