ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లిఖార్జునస్వామికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. బంగారు వస్తువులు అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 07:02 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామికి టీడీపీ ఎమ్మెల్యే బంగారు వస్తువులు కానుకగా సమర్పించుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం శాసనసభ్యుడు జేసీ అస్మిత్ రెడ్డి శ్రీశైలం దేవస్థానానికి బంగారు వస్తువులను విరాళంగా అందించారు. 379 గ్రాముల బంగారంతో చేయించిన కూర్మ సింహాసనం, 249 గ్రాముల బంగారంతో చేయించిన పళ్లెం శ్రీశైలం దేవస్థానానికి కానుకగా సమర్పించారు. శుక్రవారం శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావును కలిసిన జేసీ అస్మిత్ రెడ్డి బంగారు వస్తువులను కానుకగా సమర్పించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన కుటుంబసభ్యులు శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు.


మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ తరుపున పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆయన విజయం సాధించారు. మరోవైపు శ్రీశైలంలోని దవాఖానాకు వైద్య పరికరాలు విరాళంగా అందాయి. దేవస్థానంలోని దవాఖానకు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌‌కు చెందిన ఇందుకూరి సిద్దారెడ్డి వైద్య పరికరాలు విరాళంగా అందజేశారు. రక్త పరీక్షలు చేసేందుకు ఉపయోగించే హేమటాలజీ అనలైజర్, యూరిన్ టెస్టులకు ఉపయోగించే యూరిన్ కెమెస్ట్రీ ఆటోమేటేడ్ అనలైజర్ పరికరాలను సిద్ధారెడ్డి.. ఆస్పత్రికి విరాళంగా అందించారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావును కలిసి ఈ పరికరాలను అందజేశారు. వీటి విలువ నాలుగు లక్షల రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా.


మరోవైపు అధునాతన వైద్య పరికరాలు అందజేసినందుకు దాతలకు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అధునాతన వైద్య పరికరాల సాయంతో దవాఖాన ద్వారా స్థానికులు, యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం దక్కిందని అన్నారు. మరోవైపు శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటో తేదీన ముగుస్తాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com