బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు మెట్రోలో రేపట్నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే బెంగళూరు మెట్రోలో స్మార్ట్ కార్డులకు 5 శాతం.. ప్రయాణ సమయాన్ని బట్టి ఇచ్చే 5 శాతం డిస్కౌంట్ కొనసాగుతుందని వెల్లడించారు. ఆదివారం, నేషనల్ హాలిడే రోజుల్లో మెట్రో ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని బెంగళూరు మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు గరిష్ఠ టికెట్ ధర రూ.60 ఉండగా.. దాన్ని రూ.90 కి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అదే సమయంలో బెంగుళూరు మెట్రో స్మార్ట్ కార్డ్లపై ప్రస్తుతం ఉన్న 5శాతం తగ్గింపును కొనసాగించాలని నిర్ణయించింది. పీక్ అవర్స్ను బట్టి స్మార్ట్ కార్డ్లపై అదనంగా మరో 5 శాతం తగ్గింపును అందించాలని యోచిస్తోంది. ఇందులో మెట్రోలోకి ప్రవేశించే సమయం ఆధారంగా పీక్ అవర్లో 5 శాతం.. పీక్ ఎఫెక్టివ్లో 5 శాతం డిస్కౌంట్ అందిస్తారు. ఆఫ్ పీక్ అవర్లో 10 శాతం.. టికెట్ ధరపై తగ్గింపు ఉంటుంది. ఆఫ్ పీక్ అవర్స్ తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. అనంతరం రాత్రి 9 గంటల నుంచి మెట్రో సమయం ముగిసే వరకు ఉంటుంది.
మరోవైపు.. మెట్రో ప్రయాణికులకు అన్ని ఆదివారాలు, జాతీయ సెలవు దినాల్లో 10 శాతం కల్పిస్తారు. జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2వ తేదీల్లో ఈ తగ్గింపు ఉండనుంది. ఇక స్మార్ట్ కార్డు ఉన్న మెట్రో ప్రయాణికులు తక్కువలో తక్కువ రూ.90 ఉంచుకోవాలని సూచించారు. విదేశీ టూరిస్ట్లు, గ్రూప్ టికెట్లపై ధరలను సవరిస్తున్నట్లు బెంగళూరు మెట్రో అధికారులు వెల్లడించారు.
మెట్రో ఛార్జీలను పెంచుతూ గత నెలలోనే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆమోద ముద్ర వేసింది. అయితే పెరిగిన మెట్రో ఛార్జీలను జనవరి 20వ తేదీ నుంచే అమలు చేయాలని నిర్ణయించినా అది కాస్తా ఆలస్యం అయింది. అయితే మెట్రో ఛార్జీల పెంపుపై బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు పునరాలోచించాలని సూచించారు. ఛార్జీల పెంపుతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రో రైళ్లలో నిత్యం 9 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
![]() |
![]() |