ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తోన్న యాత్రికుల బస్సును మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్లో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. జబల్బూర్ సమీపంలోని సిహోరో వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిని తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. నాచారానికి చెందిన 12 మంది కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లి.. పుణ్యస్నానం చేసి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో మృతులను సాఫ్ట్వేర్ ఇంజినీర్ శశికాంత్, అతడి కుటుంబసభ్యులు రవి, శశికాంత్, ఆనంద్, సంతోష్, బాలకృష్ణగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం బాధాకారం. ఈ ఘటనతో వారి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సెనా, ఎస్పీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ భక్తులు ప్రయాణిస్తోన్న మినీ బస్సు.. సిరోహ పట్టణం వద్ద వంతెనపై ట్రక్కు ఢీకొట్టిందని జబల్పూర్ కలెకట్ర్ దీపక్ కుమార్ సక్సెనా తెలిపారు. ఘటనా స్థలిలోనే ఏడుగురు చనిపోయారని, మరో 16 మంది గాయపడ్డారని చెప్పారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ట్రక్కు రావడంతో ప్రమాదం జరిగినట్టు వివరించారు.
క్షతగాత్రులను చికిత్స కోసం సిరోహి ఆసుపత్రికి తరలించామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. మెరుగైన వైద్యం కోసం జబల్పూర్కి తరలించినట్టు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులను గుర్తించాల్సి ఉంది.
దీనికి ముందు మైహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కుంభమేళా నుంచి కారులో వస్తున్నవార్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. నందన్ దెహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 30పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినవారు. క్షతగాత్రులను చికిత్స కోసం సత్నా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎస్యూవీని ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు ఘటనా స్థలిలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
![]() |
![]() |