భూఅంతర్గత కేంద్రం నెమ్మదించడమే కాదు, దాని ఆకారంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. ఈ మార్పులు భ్రమణాన్ని ప్రభావితం చేయడంతో పాటు రోజు సమయం కూడా పెరుగుతుందని గుర్తించారు. ఈ మేరకు అమెరికాకు చెందిన పరిశోధకులు తమ అధ్యయన ఫలితాలను నేచుర్ జియోసైన్స్ జర్నల్లో ప్రచురించారు. ఈ పరిశోధన భూ అంతర్గత కేంద్రంలో మార్పులు భౌగోళిక కాలపరిమితిలో మాత్రమే జరుగుతాయనే మునుపటి అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. భూకేంద్రం నెమ్మదించి, అపసవ్య దిశ (రివర్సు)లో తిరుగుతున్నట్టు గతంలో ఓ పరిశోధన గుర్తించిన విషయం తెలిసిందే.
భూ అంతర్భాగాలను క్రస్ట్, మాంటెల్, కోర్ అనే మూడు పొరలుగా విభజించారు. పైపొర క్రస్ట్ ఇది జీవజాలం వృద్ధి చెందడానికి అనుకూలమైంది. దాని కింద మాంటిల్ (ఘనరూపం). తర్వాత ఇనుము, నికెల్ వంటి ఖనిజాలతో ద్రవరూపంలో ఉండేది కోర్. ఇది భూమిలోపలి అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంతో సమానంగా ఉంటుంది. భూ అంతర్భాగంలో 5,180 కి.మీ. లోతులో ఉండే ఈ ప్రదేశం ఐరన్, నికెల్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది.
అయితే, వెలుపలి కోర్ అల్లకల్లోలంగా ఉన్నట్టు ఇదివరకు గుర్తించినప్పటికీ. కాల ప్రమాణాలపై లోపలి కోర్ను ప్రభావితం చేసే సామర్థ్యంపై అనిశ్చిత కొనసాగుతోంది. ‘బయటి కోర్ అల్లకల్లోలంగా ఉంటుందని విస్తృతంగా తెలుసు.. కానీ దాని ప్రభావం లోపలి కోర్ను రోజు సమయంలో మార్పులను కలిగిస్తుందని ఇది వరకు గమనించలేదు’ అని అమెరికాలోని USC డోర్న్సైఫ్ లెటర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజీ ఎర్త్ సైన్సెస్ విభాగం డీన్ ప్రొఫెసర్, అధ్యయన ప్రిన్సిపల్ పరిశోధకుడు జాన్ విడాలే తెలిపారు. బాహ్య కోర్.. లోపలి కోర్ను ప్రభావితం చేస్తుందని మొదటిసారిగా తమ అధ్యయనం గుర్తించిందని ఆయన చెప్పారు.
భూకేంద్రం నెమ్మదించినట్టు ఇటీవలి పరిశోధనలు సూచించాయి. మాంటిల్తో పరస్పర చర్య కారణంగా అంతర్గత కోర్ స్వతంత్రంగా తిరుగుతుందని భావించారు. కానీ, తాజా పరిశోధన మరింత సంక్లిష్టమైన పరస్పర చర్యను బయటపెట్టింది. ‘భూమి అంతర్గత కోర్ సమీప ఉపరితలం నిర్మాణాత్మక మార్పునకు లోనవుతుందనే ఆధారం మేము గుర్తించాం’ అని విడాలే చెప్పారు.
భూమిపై పదేపదే భూకంపాలు సంభవించే సమయంలో వచ్చే సీస్మో తరంగాల డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ తరంగాలు భూమిపైకి చేరుకోడానికి ముందు అంతర్గత పొరల్లోకి ప్రయాణం చేస్తాయి. మానవ శరీరంలోపలి అవయవాల పనితీరును సీటీ స్కాన్ ద్వారా వైద్యులు ఎలా తెలసుకుంటారో.. ఇది కూఢా భూ అంతర్గత విషయాలను తెలియజేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జున్లిన్ హౌ అన్నారు.
అధ్యయనంలో భాగంగా అంటార్కిటికా పరిధిలోని దక్షిణ సాండ్విచ్ దీవుల్లో 1991 నుంచి 2024 మధ్య సంభవించి 121 భూకంపాల డేటాను పరిశీలించారు. కాలక్రమేణా ఒకే ప్రదేశాలలో సంభవించే ఈ భూకంపాలు భూకంప తరంగాల ప్రవర్తనలో సూక్ష్మమైన మార్పులను గుర్తించడానికి అరుదైన అవకాశాన్ని అందించాయి. లోపలి కోర్కు సమీపంగా ఉపరితలం గతంలో ఊహించినంత దృఢంగా లేదని గుర్తించారు. అల్లకల్లోలంగా ఉండే బాహ్య కోర్ కారణంగా ఇది నిర్మాణాత్మక మార్పులను ఎదుర్కొంటున్నట్లు నిర్దారణకు వచ్చారు.
![]() |
![]() |