అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం అంశంపై తమ వైఖరి వెల్లడించారు. త్రిభాషా విధానంలో తప్పేమీ లేదని అన్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కు మాత్రమేనని, భాష అనేది భావవ్యక్తీకరణ సాధనం అని వివరించారు. "ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు. కానీ, మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచ వ్యాప్తంగా రాణించారు. భాష ఏదైనా సరే, దాన్ని ద్వేషించడంలో అర్థం లేదు. మన విషయానికొస్తే... మన మాతృభాష తెలుగు, మనకు హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన వాళ్లు జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళుతున్నారు. అవసరమైతే ఆ భాషలను మనం నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంది" అని చంద్రబాబు వివరించారు. కాగా, త్రిభాషా విధానాన్ని తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
![]() |
![]() |