ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ దోవల్‌కు సమన్లు.. ఖలీస్థాన్ ఉగ్రవాదికి షాకిచ్చిన అమెరికా కోర్టు

international |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 10:17 PM

ఫిబ్రవరిలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ అమెరికా పర్యటన సందర్భంగా ఎటువంటి సమన్లు అందజేయలేదని యూఎస్ కోర్టు పేర్కొంది. సమన్లు సహా కోర్టు పత్రాలను దోవల్‌కు అందజేసినట్టు ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన వాదనలను అమెరికా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పన్నూన్ పిటిషన్‌ను యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కేథరీనా పోల్క్ ఫయిల్లా తోసిపుచ్చారు. ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దోవల్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘ఫిర్యాదు దారు జత చేసిన పత్రాలు, లేఖను కోర్టు సమీక్షించింది... కోర్టు ఆదేశం ప్రకారం భారత ఉన్నతాధికారి విడిది చేసిన హోటల్ నిర్వహాకులు లేదా ఆయన భద్రతా సిబ్బందికి లేదా ఏజెంట్లకు సమన్లు ఇవ్వలేదు’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.


అజిత్ దోవల్‌తో పాటు మరో భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలపై పన్నూన్ సివిల్ దావా వేశాడు. పన్నూన్ హత్యకు భారత ప్రభుత్వ అధికారితో కలిసి గుప్తా కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గతంలోనే అమెరికా కోర్టు దోవల్, నిఖిల్ గుప్తా, రా మాజీ చీఫ్, ఏజెంట్‌తో సహా భారత ప్రభుత్వానికి సమన్లు జారీచేసింది. అయితే, ఈ సమన్లను దోవల్‌కు తాను అందజేసినట్టు పన్నూన్ కోర్టుకు తెలియజేశాడు. అయితే, భారత ప్రధానితో కలిసి అమెరికా వచ్చిన అజిత్ దోవల్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఫిబ్రవరి 12,13 తేదీల్లో కలిశారని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పన్నూన్ తెలిపారు. ఆ సమయంలో సమన్లు అందజేయడానికి తాను ఇద్దరు ప్రాసెస్ సర్వర్లు, ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకున్నానని కోర్టు డాక్యుమెంట్లలో పన్నూన్ పేర్కొన్నారు.


ఫిబ్రవరి 12న మొదటిసారి అమెరికా అధ్యక్షుడు గెస్ట్ హౌస్ బ్లెయిర్ హౌస్‌లో దోవల్ ఉన్నప్పుడు సమన్లు ఇవ్వడానికి ప్రయత్నించానని, కానీ కుదరలేదని చెప్పారు. చెక్ పాయింట్ల వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో కట్టుదిట్టమైన భద్రత ఉండటం వల్ల బ్లెయిర్ హౌస్‌కు తాను నియమించిన వ్యక్తి లోపలికి వెళ్లలేకపోయాడని తెలిపాడు. కోర్టు ఉత్తర్వులను అందజేయడానికి వెళ్లిన సర్వర్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకుని.. వెనక్కి పంపేశారని వివరించాడు.


ఆ మర్నాడు ఫిబ్రవరి 13న కూడా సమన్లు ఇవ్వడానికి అతడు ప్రయత్నించాడని, అప్పుడు కూడా లోపలికి వెళ్లడానికి అనుమతించలేదన్నాడు. దీంతో ఆ పత్రాలను బ్లెయిర్ హౌస్‌లోని కాఫీ స్టోర్ వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఇచ్చి.. దోవల్‌కు అందజేయాలని చెప్పి వచ్చేసినట్టు పేర్కొన్నాడు. తాను దోవల్‌కు సమన్లు అందించే ప్రక్రియను పూర్తి చేశానన్న పన్నూన్ వాదనలను కోర్టు తిరస్కరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com