తిరుమలలో భారీ నాగుపాము కలకలం రేపింది. తిరుమల రింగ్ రోడ్డు సమీపంలోని బి-టైప్ క్వార్టర్స్ గదుల వద్ద భారీ నాగుపాము భక్తులకు కనిపించింది. దీంతో భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే టీటీడీ సిబ్బందికి నాగుపాము గురించి సమాచారం అందించారు. టీటీడీ సిబ్బంది సమాచారంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడకు చేరుకున్నారు. అత్యంత చాకచక్యంగా నాగుపామును బంధించారు. ఈ నాగుపాము ఆరు అడుగుల కంటే పొడవు ఉన్నట్లు భాస్కర్ నాయుడు తెలిపారు. అనంతరం ఈ భారీ నాగుపామును అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. నాగుపామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు, భక్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు తిరుమల అటవీ ప్రాంతం కావటంతో అప్పుడప్పుడూ ఇలా నాగుపాములు కనిపిస్తూ ఉంటాయి. తిరుమల కొండతో పాటుగా కాలినడక మార్గంలోనూ అప్పుడప్పుడూ వన్యప్రాణులు, నాగుపాములు భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల కూడా సేవా సదన్ సమీపంలోని ఉద్యానవనంలో ఏడు అడుగుల పొడవైన జెర్రిపోతును భక్తులు గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న భాస్కర్ నాయుడు.. చాకచక్యంగా ఆ పామును బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. మరోవైపు తిరుమల క్షేత్రంలో పాములు, జంతువులు కనిపిస్తే వాటిపై దాడి చేయకుండా సమాచారం ఇవ్వాలని టీటీడీ సిబ్బంది సూచిస్తున్నారు.
![]() |
![]() |