ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి రన్యారావుతో విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త జతిన్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 08:24 PM

కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో పెద్ద పెద్ద వారితో సంబంధాలు ఉన్నాయని.. ఆమె వెనుక వాళ్లు ఉండి ఈ గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ నడిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో రన్యారావు ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నెలల క్రితమే రన్యారావుకు పెళ్లి కాగా.. తాజాగా ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు బయటికి రావడంతో ఆమె భర్త జతిన్ హుక్కేరీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి బంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైన జతిన్ హుక్కేరీ.. విడాకుల కోసం అప్లై చేశాడు.


రన్యారావు-జతిన్ హుక్కేరీకి 4 నెలల క్రితమే వివాహం అయింది. అయితే ఆమె ఏ రోజు కూడా తనతో సంసారం చేయలేదని.. వ్యాపారాలు పేరుతో తరచూ విదేశాలకు వెళ్తూ ఉండేదని.. డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరీ వాపోయినట్లు వార్తలు వినిపించాయి. తనతో ఒక్క నెల కూడా సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే రన్యారావుతో విడాకులు తీసుకోవాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జతిన్ హుక్కేరీ లాయర్‌ను కలిసినట్లు తెలిపాడు.


 2024 అక్టోబర్ 6వ తేదీన రెస్టారెంట్‌లో రన్యారావు-జతిన్ కలిశారు. అదే నెల 23వ తేదీన నిశ్చితార్థం జరగ్గా.. నవంబర్ 27వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర సహా చాలా మంది సెలబ్రిటీలు హాజరై ఖరీదైన గిఫ్ట్‌లు అందించారు. ఆ తర్వాత ఖరీదైన ఫ్లాట్‌లో కొత్త ప్రయాణం ప్రారంభించారు. అదే నెలలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తరచూ వ్యాపారాలు అంటూ దుబాయ్ వెళ్తుండేదని.. చెప్పినా వినకపోవడంతో రన్యారావుకు జతిన్ హుక్కేరీ దూరంగా ఉంటున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఇటీవల డీఆర్ఐ అధికారుల విచారణలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జతిన్ హుక్కేరీ వెల్లడించాడు.


మార్చి 3వ తేదీన కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి రూ.12 కోట్ల బంగారాన్ని తీసుకువస్తూ రన్యారావు డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. తన ఫ్రెండ్ తరుణ్ రాజుతో కలిసి ఆమె ఈ గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె నివాసాన్ని తనిఖీ చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించాయి. ఇక ఇదే కేసులో రన్యారావు తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. తన తండ్రి పేరు చెప్పుకుని రన్యారావు ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ ఉపయోగించుకున్నట్లు అధికారులు తేల్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com