ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రంగాలపై,,,భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 08:31 PM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపైనా తాము కూడా సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ టారిఫ్‌లు అమలు చేస్తామని పేర్కొన్న ట్రంప్.. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటనతో భారత్‌లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే అంచనాలను మించి భారత్‌పై సుంకాల బాంబులు వేశారు. తమకు భారత్ వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే ఉన్న ట్రంప్.. సుంకాల విషయంలో మాత్రం ఏ మాత్రం కనికరం చూపించలేదు.


అయితే అమెరికా ఉత్పత్తి చేసే వస్తువులపై ఆయా దేశాలు విధించే టారిఫ్‌లతో పోలిస్తే.. తాము సగం వరకు మాత్రమే సుంకాలు వసూలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సగటున 52 శాతం సుంకాలు విధిస్తున్నండగా.. తాము మాత్రం కేవలం 26 శాతం సుంకాలు మాత్రమే వేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్‌ టారిఫ్‌ల నిర్ణయంతో భారత్‌లోని వ్యవసాయ అనుబంధ, ఫార్మా ఉత్పత్తులపై కీలక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


 వ్యవసాయం, డెయిరీ, సీఫుడ్‌


గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌-జీటీఆర్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల కారణంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వ్యవసాయ రంగ వస్తువులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. రొయ్యలు, ఇతర సీఫుడ్‌ ఉత్పత్తులకు అమెరికా ప్రధాన దిగుమతిదారుగా ఉంది. గతేడాది భారత్ నుంచి అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్‌ సీఫుడ్‌ ఎగుమతుల విలువ 2.58 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. తాజాగా వాటిపై సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లలో వీటి ధరలు పెరిగి డిమాండ్ తగ్గిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


మరోవైపు.. వివిధ రంగాల వారీగా భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు వేర్వేరుగా ఉండనున్నాయి. తాజా నిర్ణయంతో భారత డెయిరీ ఉత్పత్తులపై టారిఫ్‌లు 38.23 శాతానికి పెరిగాయి. దీంతో అమెరికాలో భారత పాల ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. భారత్‌ నుంచి అమెరికాకు 181.49 మిలియన్‌ డాలర్ల డెయిరీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చక్కెర, కోకో ఎగుమతులపైనా ఈ టారిఫ్‌ల ప్రభావం పడనుంది.


బంగారం, టెక్స్‌టైల్స్‌


భారత్‌ నుంచి ప్రతీ సంవత్సరం 11.88 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. తాజాగా టారిఫ్‌ల పెంపుతో ఈ ఉత్పత్తులపై సుంకాలు 13.32 శాతానికి చేరనున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో వీటి ధరలు పెరగనున్నాయి. ఇక జౌళి పరిశ్రమ పైనా అధిక ప్రభావమే పడనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో భారత్ నుంచి అమెరికాకు 9.6 బిలియన్‌ డాలర్ల విలువైన దుస్తులు, ఇతర టెక్స్‌టైల్‌ ఫ్యాబ్రిక్స్‌ ఎగుమతి అయ్యాయి. భారత టెక్స్‌టైల్‌ ఎగుమతుల్లో 28 శాతం అమెరికా దిగుమతి చేసుకుంటోంది.


ఫుట్‌వేర్


ఫుట్‌వేర్ పరిశ్రమపైనా అమెరికా సుంకాల ప్రభావం పడనుంది. భారత్ నుంచి 457.66 మిలియన్‌ డాలర్ల విలువైన ఫుట్‌వేర్‌ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా-భారత్‌ మధ్య ఫుట్‌వేర్‌పై సుంకాల తేడా 15.56 శాతం ఉంది. దీంతో అమెరికాలో భారత చెప్పుల ధరలు మరింత పెరగనున్నాయి. అదే జరిగితే భారత ఫుట్‌వేర్ పక్కన పెట్టి ఇతర దేశాల వైపు చూసే అవకాశాలు ఉన్నాయి.


ఎలక్ట్రానిక్స్‌


2024లో ఎలక్ట్రానిక్స్‌, టెలికాం రంగాలకు సంబంధించి.. 14.39 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. తాజా సుంకాల పెంపుతో అమెరికా మార్కెట్‌లో భారత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బాయిలర్లు, టర్బైన్లు, కంప్యూటర్ల ధరలు కూడా అమెరికాలో పెరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com