ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుడ్, ఈ కామర్స్ సంస్థల్లో డెలివరీ బాయ్స్‌కు రెస్ట్ రూమ్‌లు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 08:37 PM

ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ వ్యాపారం విస్తరించడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో సామగ్రిని కస్టమర్లకు సురక్షితంగా.. వేగంగా అనుకున్న సయమానికి అందించడానికి ఎక్కువ ఒత్తిడిలో పని చేయాల్సిన పరిస్థితి ఉంది. మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోడానికి కూడా టైమ్ ఉండదు. అయితే, ఫుడ్, ఇ-కామర్స్ సంస్థలో పనిచేసే డెలివరీ సిబ్బంది కోసం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. పని మధ్యలో వారు అలసిపోకుండా ఉండేందుకు నగరంలోని ముఖ్యమైన రహదారుల వెంబడి ఏసీ గదులు ఏర్పాటు చేయాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) నిర్ణయించింది. మొదటి దశలో ఐదు చోట్ల ఈ గదులను అందుబాటులోకి తీసుకురానున్నారు. డెలివరీ సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీసీసీ తెలిపింది


నగరంలో ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో దాదాపు 10 శాతం మంది మహిళలు ఉన్నారు. నిమిషాల్లో సేవలు అందించడానికి వీరు ఎంతో కష్టపడుతున్నారు. అయితే వారికి తగిన సౌకర్యాలు లేవు. పని మధ్యలో అలసట తీర్చుకోవడానికి, ఇతర అవసరాల కోసం నగరంలో సరైన వసతులు కరువయ్యాయి.


అన్నాసాలై సెకెండ్ అవెన్యూ, ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డు, ఉత్తమర్ గాంధీ రోడ్డు, రాయపేట హైరోడ్డు వంటి ప్రాంతాల్లో డెలివరీ సిబ్బందికి సరైన భద్రత లేదు. వర్షాకాలం, వేసవిలో వారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అందుకే డెలివరీ సిబ్బందికి తగిన వసతులు కల్పించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ ఇబ్బందులను గుర్తించిన కార్పొరేషన్.. విశ్రాంతి కోసం ఏసీ గదులు ఏర్పాటుచేయాలని భావించింది.


ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించింది. వారికి తాగునీటి వసతి, స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, టాయ్‌లెట్, ఏసీ వసతులతో కూడిన 24 గంటలు పనిచేసే విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ గదులను నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తారు.


తొలుత కొన్ని ప్రాంతాల్లో ఈ విశ్రాంతి గదులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని జీసీసీ భావిస్తోంది. మొదటి దశలో అన్నానగర్, నుంగంబాక్కం, రాయపేట, మైలాపూర్, త్యాగరాయనగర్ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ గదుల ద్వారా మహిళా సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. దుబాయ్ వంటి దేశాల్లో ఇలాంటి ఏసీ విశ్రాంతి గదులు ఉండటం విశేషం. ఈ విషయంపై జీసీసీ కమిషనర్ కుమరగురు భరన్ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు. "ఇవి అమల్లోకి వస్తే చెన్నైలో డెలివరీ సేవల్లో పనిచేసే వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది" అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com