ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పీ4 విధానానికి అనూహ్య స్పందన వస్తోంది. పీ4 విధానం కింద కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రసాద్ సీడ్స్ ముందుకు వచ్చింది. కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణానికి రూ.10 కోట్లు వితరణగా అందించనున్నట్లు ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని చంద్రబాబు అభినందించారు. వారితో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో గుంటూరు జిల్లా కాకుమాను మండలం రైతులకు లబ్ధి చేకూరనుంది. మండలంలోని 5,315 ఎకరాలకు తాగునీటి స్థిరీకరణ జరగనుంది.
పీ4 విధానం అంటే ఏమిటి?
పీ4 విధానం అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సహా సామాజిక-ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 విజన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఉగాది పండుగ రోజున మార్చి 30వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీ4 విధానం ప్రకారం టాప్ పదిశాతంలో ఉన్న సంపన్న వ్యక్తులు, లేదా సంస్థలు అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను ఆదుకోవాలనేది ఆలోచన. పేద కుటుంబాలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, ఎల్పీజీ కనెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.
మొదటి దశలో రాష్ట్రంలోని 20 లక్షల పేద కుటుంబాలను ఎంపిక చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థిక భరోసా అందించే సంపన్న వర్గాలను మార్గదర్శిగా.. సహాయం పొందే పేద కుటుంబాలను బంగారు కుటుంబంగా పిలుస్తారు. ప్రభుత్వం ఈ కార్యక్రమంలో సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అత్యంత పేద కుటుంబాలను గుర్తించడం, మార్గదర్శులతో వారిని అనుసంధానం చేయడం చేయటం ప్రభుత్వం పని. మరోవైపు పీ4 కార్యక్రమంలో ఎవరినీ బలవంతంగా చేర్చరు. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా జరిగే ప్రక్రియ. బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెంలో ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.
![]() |
![]() |