ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ కంపెనీలకు చైనా సంస్థల బంపరాఫర్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 09:57 PM

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. చైనాను టార్గెట్ చేసిన ట్రంప్.. సుంకాల మీదు సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో చైనా కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు.. భారతీయ కంపెనీలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. భారతీయ కంపెనీలకు 5% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. టెలివిజన్, రిఫ్రిజిరేటర్, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల ప్రకారం.. చైనా కంపెనీల రాయితీలు.. భారతీయ తయారీదారులు తమ లాభాలను 2-3% పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అమ్మకాలను పెంచుకోడానికి ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయనున్నాయి.


భారతీయ కంపెనీలు ఉపయోగించే మొత్తం ఎలక్ట్రానిక్స్ విడిభాగాలలో చైనా దిగుమతులు దాదాపు 75%. ‘చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఒత్తిడిలో ఉన్నారు’ అని గోద్రెజ్ అప్లయన్స్ విభాగం చీఫ్ కమల్ నంది అన్నారు. అమెరికా నుంచి ఆర్డర్‌లు తగ్గడంతో భారతీయ కంపెనీలతో ధరలపై చర్చించనున్నాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే రెండు నుంచి మూడు నెలలకు సరిపడే ముడి సరుకు నిల్వలు ఉంటాయి. కంపెనీలు మే-జూన్ నుంచి కొత్త ఆర్డర్‌లను ప్రారంభిస్తాయి. గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు అంతకు ముందు పోలిస్తే 36.7% పెరిగి 34.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో దిగుమతులు (2019లో 15.8 బిలియన్ డాలర్ల) 118.2% మేర పెరిగాయి.


చైనా తయారీదారులు ముడి సరుకు మిగులు సమస్యలను ఎదుర్కొంటున్నారని టెలివిజన్ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా అన్నారు. ‘‘చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆందోళన నెలకుంది.. భారతీయ కంపెనీలకు చైనా విడిభాగాల తయారీదారులు 5% వరకు ధరలు తగ్గించడానికి చర్చలు జరుపుతున్నారు’ అని మార్వా తెలిపారు. కానీ, ‘దేశీయంగా డిమాండ్ లేకపోవడం వల్ల ఈ కంపెనీలు తమకు రాయితీగా వచ్చిన ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీచేయడానికి ధరలు తగ్గించవచ్చు’ అని పేర్కొన్నారు. 2024లో చైనా నుంచి అమెరికా దిగుమతుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలదే అగ్రస్థానం.


దేశీయ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సహకాలు, నాణ్యత ప్రమాణాలపై విషయంలో కఠినంగా వ్యవహరించడం, సుంకాల వంటి కారణాలతో చైనా పరికరాలకు డిమాండ్ తగ్గింది. ఇది స్థానిక తయారీని ప్రోత్సహించింది. రెండు రోజుల కిందట ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. 2030 నాటికి ఈ రంగం 145-155 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం, చిప్‌లు, కంప్రెసర్‌లు, ఇన్నర్ గ్రూవ్డ్ కాపర్ ట్యూబ్‌లు, ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెల్‌లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు, బ్యాటరీ సెల్‌లు, డిస్‌ప్లే మాడ్యూల్‌లు, కెమెరా మాడ్యూల్‌లు, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్‌లతో సహా ముఖ్యమైన ఎలక్ట్రానిక్ భాగాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అమెరికా మార్కెట్ మందగించడం, డిమాండ్ తగ్గడం వల్ల విడిభాగాల ధరలు తగ్గుతాయని డైక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ లాల్ అభిప్రాయపడ్డారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa