ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ ఎన్నికల ముందు నితీష్ కుమార్‌కు బిగ్ షాక్

national |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 09:20 PM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు జేడీయూకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను కట్టడి చేస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఉన్న వక్ఫ్ చట్టానికి కొన్ని సవరణలు తీసుకువస్తూ తెచ్చిన ఈ బిల్లు ఇటీవలె పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఉభయసభల్లో మద్దతు తెలుపుతూ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఇప్పుడు ఇదే ఎన్డీఏ మిత్రపక్షమైన నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్-జేడీయూకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా జేడీయూ ఓటు వేయడంతో.. ఆ పార్టీలోని మైనార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా జేడీయూ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.


బిహార్‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జేడీయూ పార్టీకి వక్ఫ్ సవరణ బిల్లు రూపంలో తీవ్ర సంకట పరిస్థితి నెలకొంది. అటు కూటమి ధర్మంలో భాగంగా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఒకవైపు.. మరోవైపు పార్టీలో ఉన్న మైనార్టీ నేతలను కాపాడుకోవడం, బుజ్జగించుకోవడం మరోవైపు.. నితీష్ కుమార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో మైనార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.


తబ్రేజ్ హసన్ రాజీనామాకు ముందు జేడీయూ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్.. అలీఘర్‌కు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్ధిఖీ.. భోజ్‌పూర్‌కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. వరుసగా నేతలు రాజీనామా చేస్తుండటంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


శుక్రవారం జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు తబ్రేజ్ హసన్ తన రాజీనామా లేఖను పంపించారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల విశ్వాసాన్ని నితీష్ కుమార్ దెబ్బతీశారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నితీష్ కుమార్ లౌకిక ఇమేజ్‌ను కొనసాగిస్తారని తాను ఆశించానని.. కానీ ముస్లింలకు వ్యతిరేకంగా పదే పదే పనిచేసిన శక్తులతో నిలబడే దారిని ఎంచుకున్నారని తబ్రేజ్ హసన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టాల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఈ వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని.. ఇది ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు.


మరోవైపు.. ఎన్డీఏ మరో మిత్రపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ లోక్‌దళ్-ఆర్ఎల్డీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజాయిబ్ రిజ్వి కూడా శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎల్డీ పార్టీ చీఫ్ జయంత్ చౌదరి లౌకికవాదాన్ని వదిలిపెట్టారని.. ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో విఫలం అయ్యారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. జయంత్ చౌదరికి ముస్లింలు మద్దతు ఇచ్చారని.. కానీ ఇలాంటి సమయంలో ఆయన ముస్లింలతో నిలబడలేదని రిజ్వీ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com