ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హై టెన్షన్ మ్యాచ్‌లో ,,,కేకేఆర్‌పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 11:03 PM

ఐపీఎల్ 2025లో లో స్కోర్ హై టెన్షన్ మ్యాచ్ చూసే అవకాశం దక్కింది. భారీ టార్గెట్‌లను ఊదేసిన కోల్‌‌కతా నైట్ రైడర్స్ 111 పరుగుల ముందు చతికిలపడింది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పరుగుల తేడాతో ఓటమిపాలయింది. యుజ్వేంద్ర చాహల్ స్పిన్ మ్యాజిక్‌తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఈజీ విక్టరీ సాధిస్తుంది అనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలయింది.


పంజాబ్ కింగ్స్ అందించిన 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ వెంటవెంటనే అవుటయ్యారు. ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి అంగ్‌క్రిష్ రఘువంశీ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.


క్వింటన్ డికాక్ నాలుగు బంతుల్లో రెండు పరుగులు, సునీల్ నరైన్ నాలుగు బంతుల్లో ఐదు పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ అజింక్య రహానే నిలకడగా ఆడుతూ 17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 17 పరుగులు చేశాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయిన అజింక్య రివ్యూకు వెళ్లకుండానే పెవిలియన్ బాట పట్టాడు. రివ్యూలో బంతి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌గా పడింది.. ఒకవేళ రివ్యూకి వెళ్తే నాటౌట్ అయ్యుండేది.


రఘువంశీ స్పెషల్ ఇన్నింగ్స్


కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ తన స్పెషల్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టులో వరుస బౌండరీలతో ధైర్యాన్ని నింపాడు. 28 బంతులు ఆడిన రఘువంశీ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


చాహల్ దెబ్బకు కేకేఆర్ అబ్బా


అజింక్య రహానే‌ను అవుట్ చేసిన యుజ్వేంద్ర చాహల్ ఆ తర్వాత వరుస వికెట్లతో పంజాబ్ గెలుపులో కీలకంగా మారాడు. రహానే, రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్‌ను చాహల్ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. వెంకటేశ్ అయ్యర్‌ను మ్యాక్స్‌వెల్ అవుట్ చేయగా, హర్షిత్ రాణాను మార్కో యాన్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 62 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 17 పరుగుల తేడాతోనే ఐదు వికెట్లు కోల్పోయింది.


రసెల్ పోరాటం


ఆఖర్లో ఆండ్రీ రసెల్ పోరాడినప్పటికీ కేకేఆర్ ఓటమి తప్పలేదు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 14వ ఓవర్‌లో రసెల్ బౌండరీల వర్షం కురిపించాడు. ఆ ఓవర్‌లో రసెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. 15వ ఓవర్‌ వేసిన అర్షదీప్ సింగ్ మేడిన్‌తో వైభవ్ అరోరా అవుట్ చేయగా.. 16వ ఓవర్ మొదటి బంతికి మార్కో యాన్సన్ ఆండ్రీ రసెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో కేకేఆర్ 15.1 ఓవర్‌కు 95 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో పంజాబ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com