ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైకి స్మార్ట్ టీవీల అట్టపెట్టెలు.... లాజిక్ మిస్

Crime |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 10:02 PM

కొన్ని కొన్ని ఘటనలు చూస్తే.. అమ్మబాబోయ్ ఇదేం బుర్ర అని అనుకుంటారు. ఇదెక్కడి ప్లానింగ్ అని అనిపిస్తుంది. పోలీసులు కూడా షాక్ తినేలా ఉంటాయి నేరగాళ్లు వేసే స్కెచ్‌లు. అలాంటి ఘటనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. గంజాయి సాగు, అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. అలాగే తనిఖీలు, సోదాలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఇంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. గంజాయి స్మగ్లర్లు రోజుకో ప్లాన్ వేస్తూ రెచ్చిపోతున్నారు. గంజాయి రవాణా కోసం హైటెక్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.


అలాగే ఘటనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా స్మార్ట్ టీవీ అట్టపెట్టెల్లో గంజాయిని ఉంచి రవాణా చేయడం మొదలెట్టారు. అయితే పోలీసుల సోదాల్లో వీరి బండారం మొత్తం బయటపడింది. అయితే సాధారణంగా వీరు పోలీసులకు దొరికేవారు కాదు. కానీ అనకాపల్లి పోలీసులకు వచ్చిన ఓ అనుమానం.. వీరి యవ్వారం మొత్తాన్ని బట్టబయలు చేసింది. సాధారణంగా టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు.. టౌన్ల నుంచి పల్లెలకు తీసుకువెళ్తుంటారు. కానీ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం నుంచి స్మార్ట్ టీవీ బాక్సులను పట్టణంవైపు తీసుకెళ్తూ ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో అట్టపెట్టెలను పరిశీలిస్తే అసలు సంగతి వెలుగుచూసింది. మొత్తం మూడు పెట్టెల్లో 60 కేజీల గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ మూడు లక్షల వరకూ ఉంటుందని అంచనా.


  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన కుమారి సేదు రామన్‌ అనే మహిళ ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి కొనుగోలు చేస్తుంది. వీటిని తమిళనాడులో పొట్లాల కింద విక్రయిస్తూ.. పొట్లానికి రూ.200 చొప్పున సొమ్ము చేసుకునేది. తనకు సహాయంగా ఉండేందుకు నలుగురు వ్యక్తులను కూడా నియమించుకుంది. ఇక అల్లూరి జిల్లా వంజరి పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నాడు. ఒడిశాలో తనకు ఉన్న పొలంలో సత్యనారాయణ గంజాయి సాగు చేస్తున్నాడు. అతని వద్ద నుంచి కుమారి సేదు రామన్ గంజాయి కొనుగోలు చేస్తోంది. సత్యనారాయణ తాను సాగు చేసే గంజాయిని టీవీ అట్టపెట్టెల్లో ప్యాకింగ్ చేసి.. వీరికి విక్రయించేవాడు.


ఆ విధంగానే శుక్రవారం కూడా సత్యనారాయణ స్మార్ట్ టీవీ అట్టపెట్టెలలో గంజాయిని ఉంచి బైక్ తీసుకువచ్చారు. గబ్బాడ వద్ద కుమారి సేదు రామన్, ఆమె సహాయకులకు అందిస్తుండగా పోలీసులు అనుమానం కొద్దీ తనిఖీ చేశారు. అట్టపెట్టెలలో గంజాయి బయటపడటంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామన్న పోలీసులు.. వారి వద్ద నుంచి బైకు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com