అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక డోజ్ శా అధిపతిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ త్వరలోనే భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. శుక్రవారం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. శనివారం రోజే ఈ పోస్ట్ చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీతో మాట్లాడడం చాలా గౌరవంగా ఉందని చెబుతూనే.. భారత దేశాన్ని సందర్శించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో ఫోన్లో మాట్లిడినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అనేక అంశాలపై చర్చించామని చెప్పారు. ముఖ్యంగా వీరిద్దరి సంభాషణలో సాంకేతిక, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి చర్చించినట్లు మోదీ ప్రకటించారు. ఈ పోస్టుకు రిప్లై ఇస్తూనే... ఎలాన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారత్కు వస్తానని తన పోస్టులో పేర్కొన్నారు. 'భారత ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని.. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్గా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని రెండు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అలాగే సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై ఫోన్లో చర్చించినట్లు వెల్లడించారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తన పోస్టులో చెప్పుకొచ్చారు. టారిఫ్ల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతున్న వేళ వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.
ఎలాన్ మస్క్తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ మస్క్ ముగ్గురు పిల్లలకు పుస్తకాలను బహుకరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసి ది క్రెసెంట్ మూన్, ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్, పండిట్ విష్ణు శర్మ రాసిన పంచతంత్రను బహుమతిగా ఇచ్చారు. తర్వాత పిల్లలు పుస్తకాలు చదువుతున్నట్లు చూపించే ఫోటోలను ఆయన పంచుకున్నారు. అప్పట్లో ఈ పోస్ట్ సైతం నెట్టింట తెగ వైరల్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa