ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో హిందూ నేత కిడ్నాప్, దారుణ హత్య

international |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 11:15 PM

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై హింస ఇంకా జరుగుతూనే ఉంది. తాజాగా హిందూ కమ్యూనిటీకి చెందిన ఓ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆపై చిత్రహింసలు పెట్టి మరీ అత్యంత దారుణంగా హత్య చేశారు. గురువారం రోజే ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా దీనిపై భారత దేశం తీవ్రంగా స్పందించింది. మైనార్టీలపై చాలా రోజులుగా ఈ దాడులు సాగుతూనే ఉన్నాయని.. ఇకనైనా వాటిని ఆపాల్సిన బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని చెప్పింది. అలాగే మైనార్టీల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్ పుర్‌కు చెందిన 58 ఏళ్ల భబేష్ చంద్రరాయ్‌కు గురువారం రోజు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఎక్కడున్నావని అడగ్గా.. ఇంట్లోనే ఉన్నానని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికే నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి అతడిని బలంవంతగా తీసుకెళ్లారు. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. భబేష్ చంద్రరాయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే నరబరి గ్రామంలో భబేశ్ తీవ్రగాయలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించారు.


దీంతో పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే ఎవరో కావాలనే అతిడిపై దాడి చేసి హత్య చేశారని.. దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గురువారం రోజే కిడ్నాప్, హత్య రెండూ జరగ్గా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. భబేష్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీ నేత కిడ్నాప్, దారుణ హత్య గురించి తెలిసి తీవ్రంగా కలత చెందినట్లు వివరించారు.


బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ పాలనలో కూడా హిందూ మైనార్టీలపై అనేక దాడులు జరుగుతున్నాయని రణధీర్ జైస్వాల్ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నో దాడుల్లో ఇది కూడా ఒకటంటూనే... గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన వారంతా ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూనే.. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. చూడాలి మరి దీనిపై బంగ్లాదేశ్ సర్కారు ఎప్పుడు స్పందిస్తుందనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa