ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా బిడ్డల వైద్యం కోసం మాకో అవకాశం ఇవ్వండి

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:04 PM

తల్లిదండ్రులకు పిల్లలే లోకం. వారికి చిన్న కష్టం వచ్చినా అమ్మానాన్నలే విలవిల్లాడతారు. తమ ఆయుష్షు కూడా పోసుకుని.. పిల్లలు నిండు నూరేళ్లు చల్లగా బతకలాని కోరుకుంటారు. మరి అంత భద్రంగా కాచుకునే కంటిపాపలకు ఏవైనా అనారోగ్య సమస్యలు వాటిల్లితే ఆ తల్లిదండ్రులు బాధ వర్ణించడానికి మాటలు చాలవు. బిడ్డలను బతికించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తులు కూడా తన బిడ్డల ఆరోగ్యం కోసం స్వదేశం విడిచి ఇండియా వచ్చారు. మరికొన్ని రోజుల్లో బిడ్డకు శస్త్రచికిత్స ఉంది. అంతా బాగానే ఉంది.. త్వరలోనే వారి బిడ్డలు కోలుకుంటారని భావిస్తున్న ఆ పాకిస్థాన్ వ్యక్తుల కలల మీద నెత్తిన ముష్కరులు పెద్ద బండ వేశారు. వారి స్వార్థం కోసం అమాయకులైన వ్యక్తుల ప్రాణాలు తీసి.. ఇప్పుడు ఆ దేశ ప్రజలు సైతం ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకువచ్చారు.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం.. భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ దేశీయులు తిరిగి తమ దేశానికి వెళ్లి పోవాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య సమస్యలతో ఇండియా వచ్చిన వారు ఏప్రిల్ 29కల్లా తిరిగి వెళ్లిపోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే వైద్యం కోసం ఇండియా వచ్చిన పాకిస్థానీయులు.. భారత ప్రభుత్వం నిర్ణయంతో భయపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం తాము ఇక్కడకు వచ్చామని.. ఎన్నో డబ్బులు ఖర్చు చేశామని.. మరి కొన్ని రోజుల్లో చికిత్స మొదలవుతుంది అనగా.. ఇప్పుడిలా దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేయడం సరికాదంటున్నారు.


ఈ సందర్భంగా పాకిస్థాన్ వ్యక్తి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. తన ఇద్దరు పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారని తెలిపాడు. "ఇండియాలో అయితే ఆధునాతన వైద్య చికిత్స ఉంటుందని ఢిల్లీకి వచ్చాను. మరో వారం రోజుల్లో నా బిడ్డలకు ఆపరేషన్‌ జరగనుంది. అందుకుగాను ఇక్కడ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు మాకు ఎంతో సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని దేశం విడిచి వెళ్లిపోవాలని అంటున్నారు. ఇక్కడ ఉండటానికి.. చికిత్సకు చాలా ఖర్చు అయ్యింది. అదంతా పక్కన పెడితే.. నా బిడ్డలు బతకాలంటే కచ్చితంగా ఆపరేషన్ చేయాలి. వారంలో సర్జరీ చేస్తామంటున్నారు. ఇప్పుడిలా అర్ధాంతరంగా వెళ్లిపోమంటే.. మా బిడ్డల పరిస్థితి ఏంటని" ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


మరొక పాకిస్తానీ వ్యక్తి తన కొడుకు గుండె ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చానని, రెండు రోజుల్లో సర్జరీ అని.. కానీ ఇప్పుడు జరుగుతుందో లేదో అర్థం కావడంలేదని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలా ఇండియాలో ఉన్న ఒక్కో పాకిస్తానీయుడిది ఒక్కో రకమైన కథ. వారి కష్టం తెలిస్తే కన్నీళ్ళు ఆగడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం పహల్గాం ఎఫెక్ట్‌తో.. పాకిస్థానీయులను తక్షణమే దేశం విడిచిపొమ్మని ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఇండియన్ పోలీస్‌ యంత్రాంగం, విదేశాంగ కార్యాలయం అదే పనిలో ఉన్నాయి.


కాగా, పాకిస్తాన్‌లో ఉన్న 100 మందికి పైగా భారతీయ పౌరులు గురువారం భారతదేశానికి తిరిగి చేరుకున్నారు. అలానే భారత్‌లో ఉన్న 28 మంది పాకిస్తానీయులు వాఘా సరిహద్దు మూసేయడంతో తిరిగి భారత్‌లోకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా వైద్య సమస్యలతో ఇండియాకు వచ్చిన వారికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పిస్తే మంచిది అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వీరి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com