ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్, ,,,,యుద్ధానికి సిద్ధమైన ఇండియన్ ఆర్మీ

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:40 PM

భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ గడ్డపై ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు.. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గామ్‌ బైసరన్ లోయలో చేసిన మారణహోమానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పాక్‌పై భారత్ అనేక ఆంక్షలు విధించగా.. అందుకు ప్రతిగా పాక్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ఆర్మీ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.


భారత్ పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "సిద్ధంగా.. అలర్ట్‌గా ఉన్నాం" అంటూ ఆ వీడియోను ఎక్స్‌లో పంచుకుంది. "మిషన్‌ రెడీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా. దేనికీ భయపడం. ఏదీ మమ్మల్ని ఆపదు. ఎల్లప్పుడూ సిద్ధంగానే.." అంటూ సైనికుల విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు.. పాక్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటికే కొందరిని ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టగా.. మరింత మందిని వేటాడే పనిలో పడ్డారు. అదే సమయంలో ఇలాంటి ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌పైనా ప్రతీకార చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


మరోవైపు.. ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సైనికులపై కాల్పులు జరుపుతోంది. అయితే ఈ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతున్నట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌–పాక్‌ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే యుద్ధం విషయంలో మాత్రం భారత్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దాయాది దేశంపై భారత్‌ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతోంది అనేదానిపై సర్వతార్ ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ పెట్టిన పోస్ట్‌ మరింత ఆసక్తిని పెంచుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com