సుప్రీంకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) తదుపరి సీజేఐగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం, మే 14వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నియామక విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా ప్రకటించారు. "జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక ముందడుగు. న్యాయ రంగంలో ఆయన శ్రేష్ఠతకు, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు" అని మేఘవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అయితే, జస్టిస్ గవాయ్ సీజేఐగా సుమారు ఆరు నెలల పాటు మాత్రమే సేవలందించనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి అత్యున్నత న్యాయస్థానంలో పలు కీలక కేసుల విచారణలో, తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.
![]() |
![]() |