ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఓకేను స్వాధీనం చేసుకోండి.. భారత్‌కు బ్రిటీష్ ఎంపీ సూచన

international |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:36 PM

పహల్గాం ఉగ్రదాడిని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో పుట్టి పెరిగిన బ్రిటీష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ తాజాగా ఈ ఘటనపై స్పందించారు. కశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అప్పుడే అన్ని సమస్యలు తొలిగిపోతాయని.. ఉగ్రవాదులు, పహల్గాంలో జరిగినటువంటి చర్యలు మళ్లీ జరగవని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ దాడికి భారత్ కఠినంగా సమాధానం చెప్పాలని తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ తాజాగా పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. 26 మంది అమాయక పర్యటకుల ప్రాణాలు తీయడం అతిక్రూరమైన చర్య అని.. దాన్ని తలుచుకుంటుంటూనే రక్తం మరిగిపోతుందని అన్నారు. కశ్మీర్ వివాదంలో ఇదే చివరి ఘటన కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని అన్నారు. కశ్మీర్‌లో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామనని ప్రధాని మోదీ ఇప్పటికే చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. పీఓకే ఎప్పటికీ భారత దేశానికి అని కూడా వ్యాఖ్యానించారు.


పీఓకేను పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే.. కశ్మీర్ సమస్య పూర్తిగా సమసిపోతుందని మేఘనాథ్ దేశాయ్ వెల్లడించారు. అప్పుడే ఉగ్రవాదం రూపుమాపుతుందని వివరించారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని తాము భారత్‌ను కోరుతున్నట్లు బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉగ్రవాద నిర్మూలనలో న్యూఢిల్లీకి తాము ఎప్పుడూ అండగా ఉంటామని వివరించింది. అంతేకాకుండా ఇటీవలే లండన్‌లో భారతీయులు పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేపడుతుంటే.. అక్కడి పాకిస్థాన్ హైకమిషన్ అధికారి వారిని బెదిరిస్తున్న వీడియో చూసి తీవ్ర ఆందోళనకు గురైనట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరుపుతున్నామని కూడా వెల్లడించింది.


ఇటు ఇండియా అటు పాకిస్థాన్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నందు వల్ల వారి మధ్య ఉద్రిక్తతలు చెలరేగాలని తాము కోరుకోవడం లేదని బ్రిటీశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. ముఖ్యంగా కశ్మీర్ ప్రజల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని.. వారు ఎదుర్కుంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడాన్ని భారత్-పాక్ తమ బాధ్యతగా భావించాలని సూచించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com